- నవీన్ యాదవ్ కు మద్దతు
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : మంత్రి జూపల్లి కృష్ణరావు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా “కొల్లాపూర్ నియోజకవర్గ వలస ప్రజల ఆత్మీయ సమ్మేళనం” ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది వలస ప్రజలు పాల్గొని నవీన్ యాదవ్కు తమ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ… ఆ రోజుల్లో పొట్ట చేత పట్టుకుని పట్నం వచ్చిన కొల్లాపూర్ ప్రజలకు జీవనోపాధి కల్పించడంలో మా కుటుంబం కీలక పాత్ర పోషించిందన్నారు. అడ్డ మీద పూలు, పండ్లు, చేపల వ్యాపారం చేసుకునే అవకాశాలు కల్పించడం మా కుటుంబానికి గర్వకారణం. అప్పటి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకపోయినా, నా తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ముందుకు వచ్చి వలస ప్రజలకు ఇళ్ల స్థలాలు, వ్యాపారానికి అవసరమైన సదుపాయాలు కల్పించారు. అదే మా కుటుంబం సేవా తత్వం – అదే కాంగ్రెస్ ఆత్మ అని గుర్తు చేశారు.
మంత్రి జూపల్లి కృష్ణరావు ఎల్లప్పుడూ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుంటారు. ఆయన నాయకత్వంలో జూబ్లీహిల్స్లోని కొల్లాపూర్ ప్రజలు తమ సమస్యలను నేరుగా చెప్పగలుగుతున్నారు. మన అందరం ఏకమై కృషి చేస్తే ఈ సారి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. మీరు చూపుతున్న ప్రేమ, ఆశీర్వాదం నాకు మరింత శక్తిని ఇస్తోందని అన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతూ.. కొల్లాపూర్ ప్రజలు కష్టపడి పనిచేసే వారు, నమ్మకస్తులు. నవీన్ యాదవ్లాంటి యువ నాయకుడు మీతో ఉంటే జూబ్లీహిల్స్లో మీ గొంతు బలంగా వినిపిస్తుంది. మనందరం కలసి పనిచేసి కాంగ్రెస్ విజయం సాధిద్దాం అని పిలుపునిచ్చారు.

