Muder | మహిళ దారుణ హత్య..

Muder | మహిళ దారుణ హత్య..
- భర్తే హంతకుడు
- బైకుపై శవాన్ని పెట్టుకొని వెళ్లి..
- పోలీస్ స్టేషన్లో లొంగుబాటు
- పల్నాడు జిల్లాలో ఘటన
Muder | పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలం, మాచవరం గ్రామంలో భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. ఆదివారం జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. భార్యను గొంతు నులిమి చంపిన తర్వాత… శవాన్ని బైక్ పై పెట్టుకొని సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రకాశం జిల్లా, సంతమాగులూరు పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోవడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలం, ఏల్చూరు గ్రామానికి చెందిన అల్లరి వెంకటేష్కు, రొంపిచర్ల మండలం, మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. మహాలక్ష్మికి పెళ్లి అయినప్పటి నుండి వెంకటేష్, అతని అక్క రమణ, మరో అక్క శబరి వెంకటేష్, అన్న శ్రీను వేధింపులకు గురి చేసేవారని మృతురాలి బంధువులు ఆరోపించారు. అన్న శ్రీనుతో గడపాలని మహాలక్ష్మిని అనేక మార్లు వేధింపులకు గురి చేసేవాడని విలపించారు. ఈ విషయం గురించి పలుమార్లు తల్లితో చెప్పి మృతురాలు మహాలక్ష్మి బాధపడేదని వారు వాపోయారు.
వేధింపులు తట్టుకోలేక రెండు నెలల క్రితం పుట్టినిల్లు అయిన రొంపిచర్ల మండలం, మాచవరం గ్రామానికి మృతురాలు వచ్చిందన్నారు. ఆదివారం ఉదయం సుమారుగా ఐదున్నర గంటల సమయంలో “పాపకి బంగారం తెచ్చాను… మనం ఇంటికి వెళ్దాం… నీతో మాట్లాడాలి అని చెప్పి మాచవరం ఊరి వెలుపటికి తీసుకు వెళ్లాడు. అక్కడ మృతురాలితో గొడవపడి ఆమె వేసుకున్న చలికోట్ నుండి తీసిన లేస్ తో మెడకు వేసి బిగుతుగా లాగి మహాలక్ష్మిని దారుణంగా చంపేశాడు.
అనంతరం తన బైక్పై బాడీని కూర్చోబెట్టుకొని ప్రకాశం జిల్లా, సంతమాగులూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. జరిగింది పోలీసులకు చెప్పాడు. మహాలక్ష్మి ప్రాణంతో ఉందేమోనని పోలీసులు సంతమాగులూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ కేసును నరసరావుపేట రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
