AP | ఆధార్ స్పెషల్ క్యాంపులు..
AP, ఏపీ, ఆంధ్రప్రభ : ఏపీలో నేటి నుంచి ఈ నెల 26 వరకు స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. 5-15 ఏళ్ల పిల్లల బయోమెట్రిక్, ఇతర వివరాలు అప్డేట్ చేసుకునేందుకు వీలుగా ఈ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఏపీలో ఇప్పటికి 15.46 లక్షల మంది పిల్లల ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలియచేశారు. 15 ఏళ్ల పైబడిన వారు మరో 7 లక్షల మందికి పైగా ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి వీరంతా వారి పాత ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ స్పెషల్ క్యాంపులను ఏర్పాటు చేశారు.
చిన్నారులకు ఆధార్ బయోమెట్రిక్ కు సంబధిత పత్రాలను తీసుకెళ్లాలి. అంతేకాకుండా దరఖాస్తు ఫారం ఉండాలి. పిల్లలను తల్లి లేదా తండ్రి మాత్రమే ఆధార్ (Aadhaar) క్యాంప్కు తీసుకెళ్లాలి. చిన్నారులను ఆధార్ సెంటర్కు తీసుకెళ్లే వారి (తల్లి లేదా తండ్రి) ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇక్కడ పిల్లల ఫోటో, ఫింగర్ ప్రింట్, ఐరిస్ అప్ డేట్ అవుతాయి. ఆధార్ లో మీ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్ డేట్ చేయాల్సి వస్తే.. సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ కార్డును తీసుకుని ఉంటే.. వారికి 7 సంవత్సరాల వయస్సులోపు బయోమెట్రిక్ సమాచారాన్ని అప్ డేట్ చేయాలని, లేదంటే వారి ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేయవచ్చని యూఐడీఏఐ ఇటీవల ఒక ముఖ్యమైన హెచ్చరికను కూడా జారీ చేసింది. కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు.

