రూ..1.10 లక్షల జరిమానా
- మైనర్ డ్రైవింగ్ పై పోలీసుల స్పెషల్ డ్రైవ్
- 22 మందికి కౌన్సిలింగ్
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్(SP Sunil Sheran) ఆదేశాలమేరకు ఏ.ఎస్. పి.ఎం.జావళి సూచనలతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆదివారం నంద్యాల పట్టణం లోని మైనర్ల డ్రైవింగ్పై దృష్టి కేంద్రీకరించారు. ఈ సందర్భంగా 22మంది మైనర్లు చట్టవిరుద్ధంగా టూ వీలర్స్(Two Wheelers) నడుపుతున్నట్లు గుర్తించి, ఒక్కొక్కరికి 5 వేల చొప్పున జరిమానా విధించారు.
వారితో పాటు తల్లిదండ్రులు, సంరక్షకులను స్టేషన్ వద్దకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. రహదారి భద్రత, మైనర్ల వాహన నడపడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలు, బాధ్యతగల పర్యవేక్షణ అవసరంపై అవగాహన కల్పించారు. అదనంగా, మైనర్లకు ట్రాఫిక్ నియమాలు, సురక్షిత డ్రైవింగ్(Safe Driving) పద్ధతులపై కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు వెహికల్స్ నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం వాహన చట్టంలో కొత్త నిబంధనలు వచ్చాయని తెలిపారు.

