శివాజీ స్ఫూర్తి కేంద్ర నిర్వహణ భేష్
నిర్వాహకులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందన
నంద్యాల బ్యూరో అక్టోబర్ 16 ఆంధ్రప్రభ : చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కితాబిచ్చారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనానంతరం చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్నిసీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని సందర్శించారు. ముందుగా శివాజీ దర్బార్ హాల్ను సందర్శించి అలాగే అక్కడి గోడలపై శివాజీ జీవిత చరిత్ర పై శిల్పాలతో చిత్రీకరించిన చిత్రమాలికను ప్రధాని తిలకించారు.
ఈ సందర్భంగా అక్కడి శివాజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. .అనంతరం ఆ పక్కనే ఉన్న శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా సందర్శించారు. అక్కడ ధ్యానముద్రలో ఉన్న చత్రపతి శివాజీ, అమ్మవారి విగ్రహాలను తిలకించారు. అక్కడ కూడా అమ్మవారి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ సునిల్ షెరాన్, డోన్ ఆర్డిఓ నరసింహులు, చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రెసిడెంట్ టి.జీ.వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.సుబ్బారెడ్డి, క్షేత్ర ప్రచారక్ ఎస్. భరత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. నాగేశ్వర రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

