ఎమ్మెల్యే భూప‌తిరెడ్డికి సీఎం ప‌రామ‌ర్శ‌

నిజామాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ: నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు ఆర్.భూపతి రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప‌రామ‌ర్శించారు. ఈ రోజు భూప‌తిరెడ్డి త‌ల్లి ల‌క్ష్మీన‌ర్స‌మ్మ ద్వాద‌శ దిన‌క‌ర్మ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. హైద‌రాబాద్ నుంచి నేరుగా హెలికాఫ్టర్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు నిజామాబాద్ (Nizamabad) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఇతర జిల్లా అధికారులు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు.

అక్కడి నుండి కాన్వాయ్ లో బోర్గాం(పి) శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ (Bhumareddy Convention Hall) కు సీఎం చేరుకున్నారు. ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎంతోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.అనంతరం ముఖ్యమంత్రి కాన్వాయ్ ద్వారా కలెక్టరేట్ కు చేరుకుని, హెలికాప్టర్ లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణ‌మ‌య్యారు.

Leave a Reply