ప్రముఖ బాలీవుడ్, అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్ (52 ) ఇక లేరు. సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తుండగా.. దురదృష్టకర ప్రమాదంలో ఆయన తుది శ్వాస విడిచారు.
ఘటనపై సమాచారం అందిన వెంటనే, సింగపూర్ రెస్క్యూ టీం అతన్ని నీటిలో నుండి బయటకు తీసింది. అక్కడికక్కడే CPR ఇచ్చి, ఆపై సింగపూర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు… అతను చనిపోయినట్లు ప్రకటించారు. ఆయన మరణ వార్త విన్న అభిమానులు, సినీ, సంగీత ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
తన మరణానికి మూడు రోజుల ముందు, సెప్టెంబర్ 16న, ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేసి, అభిమానులకు, “4వ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్కు వస్తున్నాను” అని చెప్పాడు.
సంగీత ప్రయాణం..
అస్సామీ, బెంగాలీ, హిందీ భాషల్లో పాటలు పాడి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి తెచ్చుకున్నారు జూబిన్ గార్గ్. ‘యా అలీ’ (గ్యాంగ్స్టర్) పాటతో సూపర్ హిట్ అయ్యాడు. అలాగే, ‘దిల్ తు హి బాటా’ (క్రిష్ 3) వంటి పాటలు అతని గాత్రానికి అపారమైన ఖ్యాతి తెచ్చిపెట్టాయి.
గాయకుడిగానే కాకుండా నటుడు, దర్శకుడిగా కూడా పలు సినిమాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. కంచన్జుంగా, మిషన్ చైనా, దినబంధు, మోన్ జై వంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి.