పోలీసు బలగాలకు లభించిన ఎలక్ట్రానిక్ పరికరాలు
నంభాల ఎన్కౌంటర్ ప్రదేశంలో దొరికిన స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్
వాటిలో నిక్షిప్తమై డేటా ఆధారంగా వివరాల సేకరణ
నక్సల్స్ ఫొటోలు, వారి రిలేటివ్స్ వంటివాటిపై ఫోకస్
అగ్రనేత నంభాలకు ఎవరితో సంబంధాలున్నాయి
దేశ, విదేశీ శక్తులేంటి.. వారితో అనుబంధమేంటి?
ఆర్థిక వనరుల, ఆయుధాలు ఎట్లా వస్తున్నాయి
సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబోరేటరీలో డేటా అనాలసిస్
సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషలిస్టులతో డీకోడింగ్
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్
ఛత్తీస్గఢ్లోని అబూజ్మఢ్ అడవుల్లో మే 21వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన అగ్రశ్రేణి మావోయిస్టు నాయకుడు నంభాల కేశవరావు అలియాస్ బసవరాజు (70) ఆధీనంలోని ఎలక్ట్రానిక్ పరికరాలను సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు ఢిల్లీలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) కీలక సమాచారం, ఆయుధ సరఫరాదారులు, ఆర్థిక వనరులు, భవిష్యత్ ప్రణాళికల వివరాలను వెలికితీసే పనిలో దర్యాప్తు ఏజెన్సీలు బిజీగా ఉన్నాయి. బసవరాజు గతంలో సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మే 21న భద్రతా దళాలతో జరిగిన పోరులో హతమైన 27మంది మావోయిస్టుల్లో ఆయన కూడా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి మావోయిస్టు అగ్రనేతకు చెందిన ఎన్క్రిఫ్టెడ్ ఫోన్, హార్డ్ డిస్క్, ల్యాప్ ట్యాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో అధికారులు డీకోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీసు అధికారులు ఏం చెప్పారంటే..
ఇటీవల బస్తర్ రేంజీ ఐజీ పి. సుందర్ రాజ్ మాట్లాడుతూ.. “ఈ పరికరాలను సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. వీటిలో మావోయిస్టు కార్యకలాపాలు, నెట్ వర్క్, ఆయుధ సరఫరాదారులు తదితర విలువైన సమాచారం ఉంటుందని తాము నమ్ముతున్నట్టు వివరించారు. మరొక అధికారి మాట్లాడుతూ, బసవరాజు దశాబ్దాలుగా మావోయిస్టు అగ్రశ్రేణి నాయకుడని, 2003 నుంచి జరిగిన అన్ని ప్రధాన దాడులకు సూత్రధారి అని పేర్కొన్నారు. అతని ఎలక్ట్రానిక్ పరికరాలు సీపీఐ (మావోయిస్ట్) సంస్థ, దాని కార్యకలాపాల గురించి గతంలో పోలీసులు పొందలేని కీలక సమాచారాన్ని అందిస్తాయన్నారు.
విదేశీ శక్తులతో సంబంధాలపై ఆరా..
సాయుధ పోరాటంతో మాత్రమే తమ లక్ష్యాలను సాధించగలమని బసవరాజు బలంగా నమ్మాడని, అందుకే దేశీయంగా, విదేశాల్లోని ఆయుధ డీలర్లతో సంబంధాలు కొనసాగించాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. నిధులు, నియామకాలు, ఇతర సారూప్య భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలను కూడా ప్లాన్ చేసి ఉంటాడని ఆయన వెల్లడించారు. శ్రీలంక తమిళ ఈలం టైగర్స్ (ఎల్టీటీఈ) దగ్గరే మందు పాతరలు పేల్చే నైపుణ్యాన్ని సంపాదించారని, చైనా , టర్కీ, తదితర దేశాల్లోని సాయుధ కమ్యూనిస్టులతో ఆయనకు సబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ స్థితిలో మావోయిస్టు నెట్ వర్క్ను పూర్తిగా నిర్మూలించడానికి, మావోయిస్టు అగ్ర నాయకత్వం దగ్గర సమాచారమే కీలకం. అది బసవరాజు పరికరాల్లో లభిస్తుందని నమ్ముతున్నట్టు పోలీసు అధికారి తెలిపారు.
ఆయుధ సరఫరా, ఆర్గనైజర్ల డేటా కోసం..
మావోయిస్టులకు ఆయుధ సరఫరా చేసేవారి పేర్లు, సంప్రదింపుల వివరాలు, వివిధ జిల్లాల్లోని కార్యకర్తల నెట్ వర్క్, సీనియర్ నాయకత్వ స్థావరాలు, పట్టణాలలో మద్దతు కూడగట్టే ఆర్గనైజర్ల వివరాలు లభిస్తే.. మార్చి 2026 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయాలనే భారత ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. కనీసం 25 మంది కేడర్తో రక్షణ పొందిన ఈ అగ్ర మావోయిస్టు తలపై ఎన్ కౌంటర్ జరిగిన రోజు నాటికి ₹1.5 కోట్ల బహుమతి ఉంది. 2003లో అలిపిరిలో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన క్లేమోర్ మైన్ దాడితో సహా అనేక కేసులలో అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఏప్రిల్ 2010లో చింతల్నార్ మారణకాండకు కూడా ఇతనే సూత్రధారి. ఈ ఘటనలో మావోయిస్టులు పెట్రోలింగ్ నుంచి తిరిగి వస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడి చేసి 74 మంది సైనికులను చంపారు.
అంతం చేయడమే కేంద్రం లక్ష్యం..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులను అంతం చేయాలని తహతహలాడుతున్నారు. ఆయన ఛత్తీస్గఢ్ పర్యటన సందర్భంగా.. సాయుధ తిరుగుబాటును అంతం చేయడంతో పాటు పట్టణాల్లో మావోయిస్టుల భావజాలకర్తలను గుర్తించడంపై దృష్టి పెట్టాలని భద్రతా దళాలకు సూచించినట్టు సమాచారం. మావోయిస్టుల నిధులపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు పురోగతి గురించి అమిత్ షా ఆరా తీశారు. కేంద్ర హోం శాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. 2004 నుంచి 2014 మధ్య దేశంలో మొత్తం 16,463 మావోయిస్టు దాడులు జరిగాయి. అయితే.. తదుపరి పదేళ్లలో (2014–2024) అవి 53 శాతం తగ్గి 7,744కి చేరాయి. 2019 నుంచి 2025 వరకు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో కలిసి, వామపక్ష తీవ్రవాదం ప్రభావిత రాష్ట్రాల్లో మొత్తం 320 శిబిరాలను ఏర్పాటు చేశాయి. వీటిలో 68 నైట్-ల్యాండింగ్ హెలిప్యాడ్లు ఉన్నాయి. అదనంగా.. 2014లో 66 ఉన్న బలమైన పోలీస్ స్టేషన్ల సంఖ్య ఇప్పుడు సుమారు 620కి పెరిగింది.