- సివిల్ మ్యాటర్ లో పోలీసుల అరాచకాలు
- ఉల్టా కేసు పెట్టి.. వేధించడం వల్లే కుంటయ్య ఆత్మహత్య
- కారకులెవరినీ వదిలిపెట్టం.. న్యాయపోరాటం చేస్తాం…
- మాజీ ఎంపీటీసీ కుటుంబానికి అండగా ఉంటాం..
సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ హయాంలో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) విమర్శించారు. కాంగ్రెస్ నేత భూమిని కబ్జా చేయడంతో ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు కరకబోయిన కుంటయ్య (kuntayya) కుటుంబాన్ని కేటీఆర్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేశాడని ఫిర్యాదు చేస్తే కుంటయ్యపైనే ఉల్టా కేసు బనాయించి వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.
సివిల్ మ్యాటర్లలో ఆరాచకాలు..
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సివిల్ మ్యాటర్లలో పోలీసులు జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు, అరాచకాలు చేయడం సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు (Congress leaders) ఏం చేప్తే అది చేయడాన్నే డ్యూటీగా భావించిన పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చె స్తామని, ఎవరిని వదిలి పెట్టమని హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా ఇంత చిల్లర లేకి పనులు చేయలేదన్నారు. మొన్న ఏసీబీ విచారణ (ACB investigation) జరుగుతున్నప్పుడు తన కోసం హైదరాబాద్ దాకా వచ్చిన కుంటయ్యను ధైర్యం చెప్పినా అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి మనసు కకావికల మైందన్నారు.

రాజకీయ నాయకులంటే ఏదేదో ఊహించుకుంటారని..
ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ… రాజకీయ నాయకులంటే అందరూ ఏదేదో ఊహించుకుంటారని, బయటికి గంభీరంగా కనిపడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని ఓ వైపు ప్రజల కోసం పనిచేస్తూ మరోవైపు కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు. కుంటయ్య భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేయడం, పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలకడంతో కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయనను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు.
చదువులు.. పెళ్లిళ్లు బాధ్యత నాదే!
పార్టీలో నిబద్దత గల నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడైన కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు, ఇతర సమస్యలు అన్నింటికీ తనదే బాధ్యత అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కుంటయ్య కుటుంబానికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందన్నారు. ఇవ్వాళ కుంటయ్య.. రేపు మరొకరికి ఇలాగే జరగొచ్చని, ఈ అరాచకాలను ప్రభుత్వం అదుపు చేయాలన్నారు. పెద్దకర్మ జరిగేదాకా పార్టీ జిల్లా నాయకత్వమే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుందన్నారు. కుంటయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని కేటీఆర్ ప్రార్థించారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు ఉన్నారు.