విజయవాడ – ఏపీ రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్ట్ కొమ్మినేని (Kommineni) శ్రీనివాసరావు అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టులో బెయిల్ కోసం కొమ్మినేని దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్కడ ఆయన బెయిల్ పిటీషన్ పెండింగ్లో ఉండగానే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ.. వెంటనే విడుదల చేయాలని ఆదేశాలిస్తూ.. మరోసారి అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని కొమ్మినేనికి సుప్రీం ధర్మాసనం (Supreme Court) సూచించింది. ఈ కేసులో మరో జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలతో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా ఉన్న కొమ్మినేనికి సంబంధం లేదని పేర్కొంది. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కింది కోర్టు విధించిన షరతులకు లోబడే బెయిల్ మంజూరీ చేస్తున్నామని పేర్కొంది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు (Trial Court) ఇస్తుందని న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం స్పష్టం చేసింది.