మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ బీఎస్ఎఫ్ జవాను మృతిచెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గంగారం మండల పరిధిలోని అందుగులగూడెం గ్రామానికి చెందిన మద్దెల ప్రకాశ్ జమ్మూకశ్మీర్లో ఎల్వోసీ వెంట విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇటీవలే ఐదురోజుల క్రితమే స్వగ్రామానికి సెలవుపై వచ్చాడు. ఈ క్రమంలోనే పెగడపల్లిలో జరుగుతోన్న ఓ విందుకు అతడు బైక్పై వెళ్తుండగా.. కొత్తగూడ మండలం పెగడపల్లి శివారులోకి రాగానే ప్రకాశ్ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు ప్రకాశ్ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. ఇవాళ ప్రకాశ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి ఆకస్మిక మృతితో గిరిజన ప్రాంతమైన గంగారం మండలం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మారుమూల గ్రామం నుంచి దేశ సేవలో ఉన్న యువకుడిని చూసి అక్కడి వారు గర్వంగా చెప్పుకునే వారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం తమ ప్రాంతానికి తీరని లోటని మండల ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.