BJP MP | రేవంత్ డీఎన్‌ఏలో కాంగ్రెస్ లేదు : ల‌క్ష్మ‌ణ్‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సీఎం రేవంత్ రెడ్డి డీఎన్ఏలో కాంగ్రెస్ లేద‌ని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేంద్రం చేపట్టబోతున్న కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కులగణనకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో వ్యతిరేక‌మన్నారు. ఆ పార్టీ గురించి రేవంత్ ఇంకా చాలా తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఓబీసీలపై రాహుల్, రేవంత్‌లు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసమే తెలంగాణలో సర్వే చేపట్టారని ధ్వజమెత్తారు. చేసిన సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్‌ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

ఎవ‌రి ఒత్తిడికి త‌లొగ్గ‌లేదు..
ప్ర‌ధాన మంత్రి ఎవరి ఒత్తిడికి తలొగ్గలేదని.. కంటితుడుపు చర్యగా తాము సర్వేలు చేయబోమని ల‌క్ష్మ‌ణ్‌ అన్నారు. సామాజిక అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కులగణనను చేపట్టబోతోందన్నారు. ఇక జనగణనతో పాటు కులగణన చేపడుతున్నందుకు ఆయన ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. ఈ పరిణామంతో బడుగు, బలహీనవర్గాల అభివృద్ధిలో దూసుకెళ్తారని ఆకాంక్షించారు. శాస్త్రీయంగా కులగణన చేయాలని మోడీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలతో సర్వే చేయించిందని, ఆ వివరాలను కూడా బహిర్గతం చేయలేదని ఆరోపించారు. ఆ సర్వే పేరుతో కాంగ్రెస్ అక్షరాల రూ.5వేల కోట్లను దుర్వినియోగం చేసిందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.

Leave a Reply