Condolence | సింహచలం ఘటనపై మోదీ విచారం … నష్టపరిహారం ప్రకటన

న్యూ ఢిల్లీ ‍ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి తొమ్మిది మంది భక్తులు మృతి చెందిన దుర్ఘ‌ట‌న‌పై ప్రధాని న‌రేంద్ర‌ మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల‌కు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయ‌ప‌డిన వారు త్వరగా కోలుకోవాలని ప్ర‌ధాని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

కాగా, లక్ష్మీనరసింహ స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు క్యూలైన్ల‌లో ఉన్న స‌మ‌యంలో వారిపై గోడ కూలడంతో తొమ్మిది మంది చ‌నిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. మ‌రో న‌లుగురు గాయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌ను విశాఖ‌ప‌ట్నం కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ. 300 టికెట్‌ కౌంటర్‌ వద్ద ఉన్న ఓ గోడ కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *