రాష్ట్రస్థాయి ఉత్తమ ఏపీఎంగా కుంట గంగాధర్…

రాష్ట్రస్థాయి ఉత్తమ ఏపీఎంగా కుంట గంగాధర్…

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కమ్మర్ పల్లి మండల ఏపీఎంగా రాష్ట్ర స్థాయిలోని అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను రాష్ట్రస్థాయి మొదటి ఉత్తమ ఏపీఎంగా కుంట గంగాధర్ అవార్డు అందుకున్నారు.ఈ విషయాన్ని ఆయన ఆదివారం మీడియాకు వెల్లడించారు.స్త్రీ నిధిలో 98.8 శాతం రికవరీతో 100 శాతం పైగా రుణాల పంపిణీ సమృద్ధి డిపాజిట్లు వంటి స్త్రీ నిధి పథకాల అమలులో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న 565 మండలాల్లో కమ్మర్ పల్లి మండలాన్ని మొదటి స్థానంలో నిలిపినందుకు గాను శనివారం రాత్రి హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఏపీఎంగా అవార్డు ప్రదానం చేసినట్లు వెల్లడించారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో కమ్మర్ పల్లి మండలంలో అందించిన సేవలకు గాను స్త్రీ నిధి నుంచి ఈ అవార్డు సీఎంవో (ప్రజావాణి) కార్యదర్శి, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్, సెర్ప్ సీఈవో, మెప్మా ఎండీ దివ్య దేవరాజన్ ఐఏఎస్ చేతులమీదుగా, శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రావు సమక్షంలో అప్పటి కమ్మర్ పల్లి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చాట్ల రోజా రాణి తో కలిసి అందుకున్నారు.ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ ఈ అవార్డు రావడానికి కమ్మర్ పల్లి మండలంలో ఆరుగురు సీసీలు భలే రావు రవికుమార్, వర్ణం శ్రీనివాస్, సుంకరి నవీన్, భాగ్యలక్ష్మి, పీర్య, అలేఖ్యలతో పాటు 29 మంది వివోఏలు మండల సమాఖ్య సిబ్బంది స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ రేణుకలు కలిసి కృషి చేసినట్లు వెల్లడించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సాయ గౌడ్, జిల్లా అధికారుల మార్గ నిర్దేశంలో ఈ అవార్డును సాధించినట్లు ఆయన వెల్లడించారు.

కాగా ఇది వరుసగా రెండవసారి రాష్ట్రస్థాయి లో కమ్మర్ పల్లి మండల మహిళా సమాఖ్యను మొదటి స్థానంలో ఉంచి ఉత్తమ ఏపిఎంగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఇది ఇలా ఉండగా కుంట గంగాధర్ తెలంగాణ ఐకెపి సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకపక్క ఉద్యోగుల హక్కుల కోసం తరచూ రాజధాని వెళ్లి వస్తూ ఉంటూనే మండల స్థాయిలో సిబ్బందితో సమన్వయం చేసుకొని స్త్రీ నిధిలో కమ్మర్ పల్లి మండలాన్ని ఏకంగా రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నిలపడం పట్ల ప్రస్తుత కమ్మర్ పల్లి ఏపిఎం కిరణ్ కుమార్,తోటి ఉద్యోగులు మహిళా సంఘాల ప్రతినిధులు అభినందిస్తున్నారు.

కాగా గత ఆగస్టులో జరిగిన బదిలీల్లో కుంట గంగాధర్ కమ్మర్ పల్లి మండలం నుంచి ఏరుగట్ల మండల ఏపీఎంగా బదిలీపై వెళ్లారు, అలాగే మోర్తాడ్ మండలం ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత కమ్మర్ పల్లి మండల సమాఖ్య అధ్యక్షురాలు కమల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply