డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం..

డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం..
- బస్తీల్లో కమ్ముకున్న పొగ
- రంగంలోకి దిగి మంటలు ఆర్పించిన కౌన్సిలర్లు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీ డంపింగ్ యార్డులో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 11:00 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాలైన బెల్లంపల్లి బస్తీ, గోల్బంగ్లా బస్తీలు దట్టమైన పొగతో నిండిపోయాయి. చెత్త తగలబడటంతో వెలువడడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే 4వ వార్డు కౌన్సిలర్ ఈట కమల-రాకేష్, 19వ వార్డు కౌన్సిలర్ మీర్జా సిమ్రాన్ కలీమ్- కలీమ్ లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో వారు తక్షణమే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఫైర్ ఇంజిన్ను రప్పించారు. అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో కలిసి కౌన్సిలర్లు, బస్తీ యువకులు మంటలను అదుపులోకి తెచ్చేలా కృషి చేశారు. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టిన కౌన్సిలర్లకు, అధికారులకు బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.
