200 మంది యువ‌త ర‌క్త‌దానం

200 మంది యువ‌త ర‌క్త‌దానం

గోదావరిఖని, ఆంధ్రప్రభ : అనారోగ్యానికి గురైన వారిని… ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు రక్తం ఎంతో అవసరం అని… అందుకని ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్(Amber Kishore) పిలుపునిచ్చారు. ఈ రోజు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా రక్తదాతలను ఉద్దేశించి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ మాట్లాడుతూ… ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదం జరగడం కారణంగా అనుకున్న సమయానికి రక్తం అందక ఎందరో మృత్యువాత పడుతున్నారని చెప్పారు. అత్యవసరమైన ఆపరేషన్ల(Operations) సందర్భంగా రోగులకు రక్తం అవసరం ఉంటున్న నేపథ్యంలో రక్తదానం చేయడం మూలంగా మరొకరి జీవితానికి వెలుగులను ఇచ్చిన వారు అవుతామని పేర్కొన్నారు. సరైన అవగాహన లేనందున రక్తదానం చేసేవారి సంఖ్య తగ్గిపోతుందని లయన్స్ క్లబ్‌(Lions Club)తో పాటు అనేక స్వచ్ఛంద సంఘాలు ప్రజానీకంలో అవగాహన కల్పించడం ప్రత్యేక రక్తదాన శిబిరాలతో రక్త సేకరణ జరుగుతుందన్నారు.

రక్తం దానం చేయడం మూలంగా అనారోగ్యం ఎదురవుతుందని, ఇబ్బందులకు గురవుతామని ఇప్పటికీ చాలామందిలో అపోహ ఉందని, అయితే రక్తదానం చేయడం వల్ల ఎలాంటి హాని లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా, విధిగా ఆలోచన చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని రామగుండం(Ramagundam) పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు.

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో రక్తం దానం చేయడానికి ముందుకొచ్చిన యువతను సీపీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి డీసీపీ కరుణాకర్(DCP Karunakar), గోదావరిఖని ఏసిపి మడత రమేష్, గోదావరిఖని సిఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సిఐ ప్రదీప్ కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సహజ రాజేందర్, ఎల్లప్ప, మల్లికార్జున్ తో పాటు ఎస్ఐలు పాల్గొన్నారు.

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గోదావరిఖని పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారుగా 200 మంది యువత రక్తాన్ని దానం చేశారు.

Leave a Reply