1990 Vinayaka | లింగరూపంలో దర్శనం…

1990 Vinayaka | లింగరూపంలో దర్శనం…
1990 Vinayaka | తిర్యాణి, ఆంధ్రప్రభ : మండలంలోని మొయిందా గ్రామ సమీప కొండపై వెలసిన రామ శంకర ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం, ఈ పవిత్ర స్థలం 1990 వినాయక చవితి రోజున ప్రత్యేకంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన రాయి సిడం లింగుకు స్వప్నంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నేను మొయిందా గ్రామ కొండపై ఉన్నాను నన్ను గుర్తించి అందరికీ తెలియజేయాలి అని ఆదేశించినట్లు చెబుతున్నారు.
మొదట దీనిని ఒక మాయగా భావించిన లింగు, వినాయక చవితి రోజున కొండపైకి వెళ్లి పరిశీలించగా పడమర దిశలో లింగ రూపంలో శంకరుని పాదాల ఆకారం దర్శనమిచ్చింది. ఈ సంఘటనతో గ్రామస్తులు ఆ ప్రాంతాన్ని పవిత్ర క్షేత్రంగా భావించి పూజలు ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు దూర ప్రాంతాల నుండి దండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ తమ కోరికలను కోరుకుంటున్నారు. కోరిన కోరికలు నెరవేరుతున్నాయని భక్తుల విశ్వాసం. ఇంకా ఒక విశేష సంఘటన కూడా స్థానికులు చెబుతున్నారు.

ఒక ఆవు దూడకు జన్మనిచ్చిన వెంటనే కొండపైకి ఎక్కి లింగాన్ని ఐదు సార్లు ప్రదక్షిణ చేసినట్లు చెబుతారు. దీన్ని నందీశ్వరుడి మహిమగా భావించి అక్కడ ప్రత్యేకంగా నందీశ్వరుడికి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రామ శంకర ఆలయం భక్తి, విశ్వాసాలకు కేంద్రంగా మారింది. ముఖ్య పర్వదినాల్లో భారీగా భక్తులు తరలివస్తూ ప్రత్యేక అభిషేకాలు, జాగారాలు నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలు ఈ ఆలయాన్ని తమ ఆధ్యాత్మిక గౌరవంగా భావిస్తూ పరిరక్షిస్తున్నారు.
click here to read more : 14Feb2026 | శనివారం, నేటి తిరుమల సమాచారం..
