నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 13(ఆంధ్రప్రభ) : సర్కారు దవాఖాన (Government hospital) లో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో గత అర్ధరాత్రి యువకుడు సాయిలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. జుక్కల్ (Jukkal) మండలంలోని గ్రామానికి చెందిన సాయిలు భార్య సంగీత గర్భిణి. ఈనెల 5న సంగీతకు నొప్పులు రావడంతో చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సంగీత ఆరోగ్య పరిస్థితి ప్లేట్ లెట్స్ తగ్గడంతో మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సంగీత కుటుంబ సభ్యులకు సూచించారు.
సంగీత (Sangeetha) కుటుంబ సభ్యులు ఈనెల 5న అర్థరాత్రి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకువచ్చారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసు పత్రిలో బిడ్డ పుట్టి చనిపోయినట్లు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు (Doctors) తెలిపారు. సంగీత రెండవ డెలివరీ కోసం బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ పరిస్థితి విషమించడంతో కామారెడ్డికి తీసుకెళ్లాలని వైద్యులు తెలపగా, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు వైద్యులు తెలిపారు.
కాగా అప్పటికే సంగీత ఆరోగ్య పరిస్థితి విషమిచింది. బిడ్డ పుట్టి చనిపోయింది. ప్రస్తుతం సంగీత జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బిడ్డ పుట్టి చనిపోవడం, భార్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం, ఇంకేమైనా పరిస్థితుల ప్రభావంతో ఆత్మహత్య (suicide) కు పాల్పడ్డా డా ? పూర్తి వివరాలు తెలియరాలేదు. వన్ టౌన్ పోలీసులు (One Town Police) సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.