YCP PATCHY : ప్చ్.. హోదా పేచీ Andhra Prabha Insight Story

YCP PATCHY : ప్చ్.. హోదా పేచీ Andhra Prabha Insight Story
జెడ్ కేటగిరి దొరకదు
నోవర్క్..నో పే పీడ తప్పినట్టే
జనం సానుభూతే లక్ష్యం
ఇదీ వైసీపీ నయా వ్యూహం
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకూ అసెంబ్లీకి వచ్చేది లేదని తేల్చిచెప్పిన పులివెందుల ఎమ్మెల్యే..వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 11, 2026న (బుధవారం) అసెంబ్లీకి వచ్చారు. హమ్యయ్య జగనన్న అసెంబ్లీకి వచ్చాడు,

కూటమిని కడిగి పారేస్తారని ఆశిసించి వైసీపీ శ్రేణులకు యథా రాజా తథా ప్రజ రీతిలో నిరాశ తప్పలేదు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన అసెంబ్లీకి రావడం ఇది మూడవసారి. మొదటిసారి జూన్ 2024లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారు. రెండోసారి ఫిబ్రవరి 24, 2025న బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం సమయంలో హాజరయ్యారు. నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేసి వెళ్లి పోయారు. ఇప్పుడు మళ్లీ గవర్నర్ ప్రసంగం సమయంలో హాజరై, సుమారు 11 నిమిషాలకే వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయన్న పాత్రుడు కూడా 11 తేదీన, 11 మందితో వచ్చి 11 నిముషాల్లో వెళ్లిపోయారు అని వ్యాఖ్యానించారు.
YCP PATCHY : నోవర్క్.. నో పే .. హెచ్చరికతోనే..
అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు పొందే ఎమ్మెల్యేల విషయంలో “నో వర్క్.. నో పే” (పని లేకపోతే జీతం లేదు) నిబంధనను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన జగన్, “తాను అటువంటి జీతం కోసం ఆశపడేంత పేదవాడిని కాదు” అని వ్యాఖ్యానించారు.

కానీ.. ఇందులోనే ఓ తిరకాసు ఉంది. వరుసగా 60 రోజుల పాటు సభా సమావేశాలకు హాజరుకాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయ్యే (Disqualification) ప్రమాదం ఉంది. ఈ అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికే ఆయన కేవలం సంతకం చేసి వెళ్ళిపోతున్నారని అధికార పక్షం విమర్శిస్తోంది. తనకు ప్రతిపక్ష హోదా (LoP Status) ఇవ్వనందుకు నిరసనగా (YCP PATCHY ) తాము సభను బహిష్కరిస్తున్నట్లు జగన్ గతంలోనే ప్రకటించారు. ఈ రోజు కూడా అదే నినాదంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అంతలోనే వాకౌట్ చేశారు.
YCP PATCHY : కేబినేట్ హోదా కోసమే
ప్రతిపక్షం హోదా కోసం దాదాపు ఏడాదిన్నరగా వివిధ రూపాల్లో జగన్ పోరాడుతున్నారే గానీ.. ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీలో నిలిచి తన గొంతును ఏరీతిలో అధికార పక్షం నొక్కేస్తోందో.. జనానికి నిరూపించలేదు. తాజాగా ఆయనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ కావాలని డిమాండ్ చేస్తోంది. అధికార కూటమిలో ఏ మాత్రం చలనం కనిపించటం లేదు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. స్థానిక సంస్థల ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ.. జగన్ వ్యూహం ఓ మిస్టరీగా మారింది.
YCP PATCHY : జనం సానుభూతే లక్ష్యం

వైసీపీ అధినేత సరి కొత్త వ్యూహంతో .. మొదటి రోజే అసెంబ్లీ సమావేశాల్ను బహిష్కరించారు. బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమాలోచనలు చేశారు. ప్రస్తుతం శాసన మండలిలో సర్కారును ఇరుకున పెట్టే అవకాశం ఉన్నందున అధికార కూటమి వ్యవహారాలను ఎప్పటికప్పుడు చిత్తు చేయాలని వైఎస్ ఆదేశించారని సమాచారం. ఇక జనం మధ్యకు వెళ్దామని, ప్రజలకు కూటమి ఆగడాలను వివరిద్దామని ఓ నిర్ణాయనికి వచ్చారు.

2024 ఎన్నికల తర్వాత కేవలం 11 సీట్లకు పరిమితమైన వైసీపీ , అప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ వస్తోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అధికార కూటమి తమ గొంతును నొక్కేస్తోందని ఆరోపిస్తూ.. గవర్నర్ ప్రసంగం, ప్రమాణ స్వీకారాలకు మాత్రమే హాజరవుతున్నారు. ఈసారి కూడా జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు సభకు వచ్చి నినాదాలు చేసి వాకౌట్ చేశారు. 12వ తేదీన ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, మిగిలిన సమావేశాల్లో ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చించనున్నారు. అసెంబ్లీలో హోదా లేకుండా మాట్లాడే అవకాశం తక్కువేనని భావిస్తూ బహిష్కరణ ద్వారా ప్రజల సానుభూతి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. జగన్ తన ఎమ్మెల్యేలను ‘ప్రజల మధ్యకు వెళ్లి పోరాడండి’ అని పిలుపు నిచ్చారు.
YCP PATCHY : అనర్హత వేటుపై భయం..

మరోవైపు సభలో లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు లేవనెత్తలేకపోవడం, డిస్క్వాలిఫికేషన్ భయం పట్టుకుంది. ప్రతిపక్ష హోదా అ సాధ్యమే? 175 సభ్యుల అసెంబ్లీలో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతిపక్ష హోదా (లీడర్ ఆఫ్ ఆపోజిషన్ – ఎల్ఓపీ) కోసం సాధారణంగా సభ సభ్యుల్లో కనీసం 10- శాతం (సుమారు 18- సీట్లు) అవసరమని నిబంధనలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఈ హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. హైకోర్టులో పిటిషన్ వేసినా ఇంకా ఫలితం లేదు. రాజకీయ ఒత్తిడి ద్వారా హోదా సాధించడం కష్టమే. ఎందుకంటే అధికార కూటమికి 164 సీట్లతో భారీ మెజార్టీ ఉంది. ప్రతిపక్ష హోదా లేకుండా వైసీపీకి సభలో మాట్లాడే అవకాశం తక్కువే. కేవలం 2 నిమిషాలు మాత్రమే ఇస్తారని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ డిమాండ్ ద్వారా పార్టీ ‘అన్యాయానికి గురైన పార్టీగా ప్రజల్లో సానుభూతి కోసం చిత్రీకరిస్తే వ్యూహాత్మక లాభమని విశ్లేషకులు చెబుతున్నారు.
YCP PATCHY : జగన్ ఏమంటున్నారంటే
గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలోని గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించడం బాధాకరమని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు.. అంటూ నినాదాలు చేశారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం, సభ్యుల హక్కులను కాపాడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. నినాదాలు చేశారు

ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను గవర్నర్ చదువుతున్నారు. తన ప్రసంగంలో చదువుతున్నది వాస్తవమా కాదా అని కూడా గవర్నర్ చూడటం లేదు. 3.2 లక్షల కోట్లు అప్పులు చేసి ఎవరికిచ్చారు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన సాగుతోందని.. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి లేదన్నారు. మహిళా సాధికారత కొరవడింది.. రైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పాలనా వైఫల్యాలను ఎండగడతామన్నారు.

ఉద్యోగులపై ఈ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వం తెచ్చే ఒత్తిడితో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా వేధిస్తోంది. వాలంటీర్లకు హామీలిచ్చి ఈరోజు రోడ్డున పడేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మాటతప్పారు. ఉద్యోగాలిస్తామని మాయమాటలు చెప్పి యువతను మోసం చేశారు. ఇవన్నీ గవర్నర్ ప్రసంగంలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. అనంతరం, సభను వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.
YCP PATCHY : జనం వాదనేంటంటే

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు ప్రతపక్ష హోదా కోసం వెంపర్లాడుతున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం, ప్రతి శాసనసభ్యుడికి సభలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి ఏ హోదాతోనూ సంబంధం లేదు. సాధారణంగా సభలో ఏ పార్టీ ఎంత సమయం మాట్లాడాలనేది ఆ పార్టీకున్న సభ్యుల బలం (Numerical Strength) ఆధారంగా స్పీకర్ నిర్ణయిస్తారు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున, బలానికి తగినట్లుగా స్పీకర్ కేటాయించిన సమయంలో మాట్లాడవచ్చు. ఔను, ప్రతిపక్ష నేత హోదా ఉంటే సభలో మైక్ ఇచ్చే విషయంలో మొదటి ప్రాధాన్యత, ప్రత్యేక ఆసనం, ముఖ్యమైన అంశాలపై స్పందించడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. హోదా లేకపోతే సాధారణ ఎమ్మెల్యేగానే పరిగణిస్తారు. స్పీకర్ అనుమతితోనే మాట్లాడాలి. ప్రజల గొంతుకగా మారడానికి ఏ హోదా అవసరం లేదని, క్వశ్చన్ అవర్ (ప్రశ్నోత్తరాల సమయం), జీరో అవర్ వంటి సమయాలను వాడుకుని ప్రభుత్వ విధానాలను ప్రశ్నించవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
YCP PATCHY : గుమ్మడి నర్సయ్యను గుర్తు చేస్తూ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య ఐదుసార్లు పని చేశారు. ఆ పార్టీకి అతడే ఏకైక ఎమ్మెల్యే. కానీ ప్రజాసమస్యలపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉత్తమ ప్రజాప్రతినిధిగా పేరొందారు. ఏనాడు తనకు ప్రత్యేక హోదా కావాలని భీష్మించలేదు. హోదా లేకపోవడం వల్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు జరిగిన నష్టమేంటీ ? ప్రతిపక్ష నేతగా కేబినేట్ హోదా కావాలి. జెడ్ కేటగిరి సెక్యూరిటీ కావాలిప. ఈ ప్రోటోకాల్ కోసమే.. ప్రతిపక్ష హోదా లేదని .. అసెంబ్లీలో మాట్లాడలేనని జగన్ వాపోతున్నారని జనం చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ నియమ నిబంధనల ప్రకారం సమయం పరంగా కొన్ని పరిమితులు ఉండవచ్చు కానీ, అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని అది పూర్తిగా అడ్డుకోదు. కేవలం హోదా లేదన్న కారణంతో సభకు వెళ్లక పోవటం ప్రజల పట్ల బాధ్యతారాహిత్యమని జనం విమర్శిస్తున్నారు.
ALSO READ : Local war : వైసీపీ అయ్యోమయం Andhra Prabha Insight Story
