Yadagirigutta | భక్తులకు దేవాదాయ శాఖ షాక్ – యాదగిరిగుట్ట ఆలయంలో వ్రతం ధరలు పెంపు

యాదగిరిగుట్ట – తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామిని సందర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక సెలవు దినాలు, ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల్లో ఎక్కువగా సత్యనారాయణస్వామి వ్రతం చేయించుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఆలయ దేవస్థాన అధికారులు సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధరను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

యాదాద్రి ఆలయంలో నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధరను పెంచుతూ ఈవో వెంకట్రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు యాదాద్రిలో సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధర రూ.800 ఉండగా.. దాన్ని రూ.1000కి పెంచారు. ఇప్పటివరకు ఉన్న టికెట్‌పై రూ.800 చెల్లించి వ్రతం టికెట్ తీసుకుంటే.. భక్తులకు పూజా సామాగ్రి అందించేవారు. అయితే ఇప్పుడు యాదాద్రి దేవస్థానం వ్రతం టికెట్ ధరను రూ.1000కి పెంచారు. ఇకపై ఈ టికెట్ మీద భక్తులకు పూజ, ఇతర సామగ్రితో పాటుగా స్వామివారి శేష వస్త్రాలు అలానే సత్యనారాయణ స్వామి ప్రతిమను కూడా ఇవ్వనున్నారు. పెరిగిన టికెట్ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

ఉచిత ప్ర‌సాదం త‌యారీ పెంపు

యాదాద్రి దేవస్థానంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. భక్తులకు అందించే ఉచిత ప్రసాదాన్ని 100 కిలోల నుంచి 300 కిలోలకు పెంచుతూ యాదాద్రి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఉచిత ప్రసాదం ట్రయల్ ను దేవస్థానం ప్రారంభించింది . దీనిలో భాగంగా నేటి నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి రోజు భక్తులకు 300 కేజీల లడ్డూ, 300 కిలోల పులిహోరను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత జులై 1 నుంచి ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *