- గ్రాండ్ టెన్నిస్ కు రంగం సిద్ధం
- రికార్డ్ స్థాయి బహుమతులు
- కొత్త టెక్నాలజీ
- మ్యాచ్ టైమింగ్స్ లో మార్పులు
ఇంగ్లాండ్లో జరిగే ప్రపంచ ప్రసిద్ధ టెన్నిస్ టోర్నీ ‘వింబుల్డన్’ ఈసారి (2025) మరింత జోష్, మరింత ప్రైజ్ మనీతో ప్రేక్షకులను, ఆటగాళ్లను ఉర్రూతలూగించనుంది. ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ (AELTC) తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మొత్తం ప్రైజ్ మనీ ఏకంగా £53.5 మిలియన్లు – అంటే దాదాపు ₹606 కోట్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 7% ఎక్కువ కాగా, 10 ఏళ్ల కిందటితో పోలిస్తే రెండింతలు పెరిగింది.
చాంపియన్లకు భారీ ప్రైజ్ మనీ !
ఈ ఏడాది పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు ఒక్కొక్కరికి £3 మిలియన్లు (సుమారుగా ₹34 కోట్లు) లభించనున్నాయి. ఇది గత ఏడాది విజేతలు కార్లోస్ ఆల్కరాజ్, బార్బోరా క్రైజికోవా అందుకున్న మొత్తం కంటే 11.1% అధికం కావడం విశేషం.
ఇతర విభాగాల్లోనూ పెరిగిన ప్రైజ్ మనీ !
ఫస్ట్ రౌండ్లోనే వెనుదిరిగిన సింగిల్స్ ఆటగాళ్లకు £66,000 (దాదాపు ₹75 లక్షలు) లభించనున్నాయి. ఇది 10% పెరిగింది. డబుల్స్ విభాగం ప్రైజ్ మనీ 4.4%, మిక్స్డ్ డబుల్స్కి 4.3% & వీల్చెయిర్, క్వాడ్ విభాగాల్లో 5.6% పెరిగాయి.
పెరిగిన ప్రైజ్ మనీ పై AELTC చైర్ డెబోరా జెవాన్స్ మాట్లాడుతూ… ఆటగాళ్లతో చేసిన చర్చలు, వారి అభిప్రాయాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఆటగాళ్లకు సరైన విశ్రాంతి లేకపోవడం, గాయాల మోతాదు పెరుగుతోందన్న విషయాల్ని దృష్టిలో ఉంచుకుని వీటిని అమలు చేశామని చెప్పారు.
టైమింగ్స్లో మార్పులు – మరింత అనుభూతికోసం !
ఈ ఏడాది నుంచి డబుల్స్ ఫైనల్స్ స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30కు), సింగిల్స్ ఫైనల్స్ సాయంత్రం 4 గంటలకు (IST ప్రకారం రాత్రి 8:30కి) ప్రారంభమవుతాయి. ఇది ప్రేక్షక అనుభవాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో చేసిన మార్పు అని నిర్వాహకులు తెలిపారు.
లైన్ జడ్జ్లు గుడ్బై – టెక్నాలజీకి హాయ్!
ఈ ఏడాది వింబుల్డన్లో ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది. సుదీర్ఘ సంప్రదాయాన్ని పక్కనపెట్టి లైన్ జడ్జ్లను తొలగించారు. వాళ్ల స్థానంలో ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ సిస్టమ్ వాడనున్నారు. అయితే, మాజీ లైన్ జడ్జిలు మ్యాచ్ అసిస్టెంట్లుగా కొన్ని కీలక పాత్రలను పోషిస్తూనే ఉంటారు.