కాల బైరవుడు శంకరుడి అవతారము కాలమును, కాలుణ్ణి భయపెట్టువాడు అని అర్ధం. మార్కండేయ, పుండరీక, ధర్మధ్వజ, కేతుధ్వజ చరిత్రలలో యమునుకి శంకరుడి వలన భయం కలిగినది. సకల లోకములను ప్రళయం చేసినవాడు రుద్రుడే. అప్పుడు కాలం కూడా భయపడుతుంది. అందువలని శంకరుని అవతారాలలో కాల భైరవ అవతారం చాలా విశిష్ఠమైనది. స్మశానంలో కాలభైరవుడిని శునిక రూపంలో ప్రతిష్టిస్తారు. ప్రళయ కారకుడు కావున స్మశానంలో ప్రతిష్ఠిస్తారు. కాశీలో కాలభైరవ క్షేత్రం చాలా ప్రశస్తం. కాశీలో మరణించిన వారికి మరుజన్మ ఉండదు కావున కాశీ కాలభైరవ క్షేత్రం.
శునకమును హీనదృష్టితో చూస్తాము కానీ శునకమును సారమేయము అంటారు. సరమ కశ్యప ప్రజాపతి సతీమణి. సరమ సంతానమే సారమేయుడు. మహాభారతం మొదలైంది సారమేయోపాఖ్యానంతోనే, జనమేజయుడు స్వర్పయాగానికి పూనుకున్నప్పుడు ఒక సారమేయుడు వచ్చి తన సంతానాన్ని జనమేజయుడి సేవకులు కొట్టారని ఆ సారమేయము యజ్ఞశాలలోకి ప్రవేశించలేదు, హవిస్సును చూడలేదు. వాసన చూడలేదు పైగా అకారణంగా హింసించారు కావున యాగం సగంలోనే ఆగిపోతుందని శపించింది. పంచపాండవులు స్వర్గారోహణల్లో వారి వెంట వచ్చింది ఒక శునకమే. చివరకు ఆ శునకం ధర్మ రూపం అని ఇంద్రుడి ద్వారా తెలుసుకుంటారు. దత్తాత్రేయుడి వెంట ఉండేది నాలుగు శునకములు అందుకే దత్తాత్రేయుడి జయంతి నాడు అనగా మార్గశీర్ష శుద్ధ పూర్ణమ నాడు కొన్ని ప్రాంతాల్లో పిండి వంటలు చేసి శునకాలకు పంచుతారు. కొందరు తాంత్రికులు కాల భైరవ తంత్రమును అనుసరించి, ఉపాసన చేస్తారు. ప్రతి ప్రాణి భగవత్స్వరూపమే అని తెలియజేడానికి భారతీయ సంస్కృతిలో పామును, నీటిని, చెట్టును, అదేవిధంగా శునకాన్ని కాలభైరవ రూపంలో పూజిస్తారు.
కాలబైరవుడు శునకరూపంలో ఎందుకుంటాడు?
