కోల్ కతా – పశ్చిమ బెంగాల్లో 25,000 టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. తనను జైల్లో పెట్టినా పర్వాలేదు.. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించబోనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఉపాధ్యాయులకు మమత మద్దతు ప్రకటించారు. దు:ఖంతో హృదయం రాయిలా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడుతున్నందుకు తనను జైల్లో పెట్టొచ్చన్నారు. తాను బతికున్నంత వరకు ఎవరూ ఉద్యోగం కోల్పోరని హామీ ఇచ్చారు. అర్హులైన ఉపాధ్యాయులకు ఎలాంటి భయం అక్కర్లేదని.. వారి ఉద్యోగాలను కాపాడే బాధ్యత తనదేనని మమత ప్రతిజ్ఞ చేశారు. తనను ఎవరైనా సవాల్ చేస్తే.. వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో తనకు బాగా తెలుసన్నారు. ఇది ‘నా నిబద్ధత’ అన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని అర్హులైన ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఎక్కడికి పోవన్నారు.
సుప్రీంలోనూ ఎదురుదెబ్బ..
గత వారం సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 25,000 మంది ఉపాధ్యాయ నియామకాలను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టింది. స్కూల్ సర్వీస్ కమిషన్ కింద 25,000 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు గత గురువారం సమర్థించింది. ఈ ప్రక్రియ అంతా మోసం హంతో తారుమారు చేయబడిందని అభిప్రాయపడింది. ఈ నియామకానికి విశ్వసనీయత లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
హైకోర్టు నిర్ణయంలో ఎలాంటి తప్పు కనిపించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పీవీ. సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నియామకాలన్నీ మోసపూరితంగా జరిగాయని తెలిపింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు కొన్ని మార్పులు చేసింది. 2016లో నియామకం అయినప్పటి నుంచి పొందిన జీతాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం సుప్రీం ధర్మాసనం సవరించింది. అలా జీతం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్పీంకోర్టు స్పష్టం చేసింది. ఇక మూడు నెలల్లోపు కొత్త ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పును మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ తీర్పును అంగీకరించబోనని ప్రతిజ్ఞ బూనారు.