విశాఖపట్నం – ఆంధ్ర ప్రదేశ్ అంతటా నైరుతి రుతుపవనాలు వ్యాపించాయి. దీంతో ఆకాశంలో నల్లని మబ్బులు కమ్మేసి వాతావరణం పూర్తిగా చల్లబడింది… వర్షాలు మరింత జోరందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
బలపడిన అల్పపీడనం ..
మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొద్దిసేపటి క్రితం బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటింది.. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, భారీ వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదలు, కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది .
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీకి ప్లాష్ ప్లడ్స్ …
ఏపీతో పాటు ఎగువన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదల అవకాశం ఉంది. గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదీ తీరాలు, సరస్సులు, చెరువులు, కాలువల్లో కొట్టుకుపోయే కేసులను తగ్గించడానికి, ప్రమాదాన్ని కలిగించే నీటి వనరులు తక్షణం గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేసారు.. ఈ హెచ్చరిక బోర్డుల్లో భద్రతా సూచనలు, సహయం కోసం అత్యవసర నెంబర్ల సమాచారం ఉంటుంది.
ఇక ఎగువ నుంచి వచ్చే నీటితో గోదావరి, కృష్ణా నదుల్లోకి భారీగా నీటిమట్టం పెరుగుతోంది. అలాగే వాగులు వంకలు వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.