- విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర..
ఆంధ్రప్రభ, విజయవాడ (కార్పొరేషన్) : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం పెజ్జోని పేట, సి కె రెడ్డి రోడ్డు, పరిసర ప్రాంతాలని పర్యటించి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లోని పెన్షన్ దారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్ ) ద్వారా చెక్ చేసి పెన్షన్ డబ్బులు అందించారు.
లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రతినెల పెన్షన్ వస్తుందా లేదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి, ప్రతినెలా ఇస్తున్న పెన్షన్ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉదయం ఆరింటికల్లా పెన్షన్ పంపిణీ మొదలుపెట్టాలని, పెన్షన్ పంపిణీలో ఎటువంటి అలసత్వం వహించరాదని, పెన్షన్ దారుల ఇంటి వద్దకు వెళ్లి కచ్చితంగా పెన్షన్ అందించాలని అన్నారు.
నగరపాలక సంస్థ పరిధిలోగల సర్కిల్ 1 పరిధిలో 18,726 పెన్షన్లు, సర్కిల్ 2 పరిధిలో 23,549, సర్కిల్ 3 పరిధిలో 18,460 పెన్షన్లు ఉన్నాయని, వారందరికీ సిబ్బంది సకాలంలో పెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తదుపరి గాంధీజీ మహిళా కళాశాల, వన్ టౌన్ వద్ద గల అన్న కాంటీన్ పరిశీలించారు. అక్కడ వచ్చిన ప్రజలతో మాట్లాడి స్వయంగా ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ పరిశుభ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు, త్రాగునీరు, వాడుక నీరు నిరంతరాయంగా రావాలన్నారు.
నోడల్ ఆఫీసర్లు అందరూ తమ తమ అన్న క్యాంటీన్లోని ప్రతిరోజు వీక్షించి ఎటువంటి లోపాలు ఉన్న వెంటనే సరి చేయాలని, ఎటువంటి రిపేర్లు ఉన్న వెంటనే మరమ్మతులు చేయించేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారాలను ఆదేశించారు. ఈ పర్యటనలో కమిషనర్ తో పాటు జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సి డి ఓ శ్రీకాంత్ పాల్గొన్నారు.

