(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : పుట్టి పెరిగిన ప్రాంతం పై మమకారంతో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ప్రవాసాంధ్రులను భయపెట్టాలని చూడడం దుర్మార్గమైన, హేయమైన చర్య అని విజయవాడ పార్లమెంటు సభ్యుడు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక వచ్చే పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే ప్రతి ఎన్నారై కు అండగా కూటమి ప్రభుత్వంతో పాటు తాను ప్రత్యేకంగా రక్షణ కవచంలా ఉంటానని తెలిపారు.
9 నెలల కూటమి పాలనలో 7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, అతి త్వరలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలగనున్నట్లు తెలిపారు. అడ్రస్ లేని సూట్ కేసు కంపెనీలను పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిని, జగన్ ఆడే డ్రామాలు ఉల్ఫా బ్యాచ్ విభిన్న పాత్రలు పోషిస్తుందన్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్న ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఎన్ఆర్ఐలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.
ఏపీకి పెట్టుబడులు వస్తుంటే జగన్ అండ్ కంపెనీ డ్రామాలు అడుతున్నాయనీ, జగన్ లాగా కూటమి ఎప్పుడు పీఠాలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ధారాదత్తం చేయలేదన్నారు. ఉర్సా కంపెనీ డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వస్తే మోకాలు అడ్డుతున్నారనీ, 3700 కోట్ల టర్నోవర్ ఉర్సా సంస్థకు ఉందనీ వివరించారు. 21 సూట్ కేసు కంపెనీలు పెట్టిన చరిత్ర ఉన్న జగన్ ఇప్పుడు ఎన్నారైల పై విమర్శలు చేయడం దారుణమన్నారు. ఎన్.ఆర్.ఐ లకు ఎవరైనా అడ్డువస్తే ఖబడ్దార్ అంటూ ఎన్.ఆర్.ఐ లకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వానికి ప్రవాసాంధ్రులు అండగా ఉంటే వారిపై విమర్శలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఉర్సా సంస్థ రాకుండా జగన్ అండ్ ఉల్ఫా టీం అడ్డుకుంటే సహించమంటూ హెచ్చరించారు.
పుట్టి పెరిగిన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనుకుంటున్న ప్రవాసాంధ్రులపై జగన్ విషం చిమ్ముతున్నాడనీ ఇంతకన్నా దుర్మార్గమైన విషయం ఇంకొకటి ఉంటుందా అని వాపోయారు. ప్రవాసాంధ్రులకు తాము అండగా ఉంటాం. వాళ్లు నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చని అభయమిచ్చారు. ప్రవాసాంధ్రుల జోలుకు ఎవరొచ్చినా ఉపేక్షించేది లేదనీ గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రం మీద, నిరుద్యోగ యువత మీద ఎందుకింత కక్ష్యకట్టారో సమాధానం చెప్పాలని బహిరంగంగా ప్రశ్నించారు. విజయవాడ వరద బాధితులకు విరాళంగా ఇచ్చిన కోటి రూపాయలు ఏం చేశారో చెప్పే ధైర్యం వైసీపీ నేతలకు లేదన్నారు.