హైదరాబాద్ : పదేళ్లు అధికారంలో ఉండేది తామేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన బసవేశ్వర 892వ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ సభకు సంపూర్ణంగా తాము సహకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలపై స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల వద్దకు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. “గత ప్రభుత్వ పథకాలు నిలిపివేసినట్లు చెబుతున్నారు. రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రజాపాలన ఆగిందా” అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎన్ని బస్సులు కావాలంటే.. అన్ని బస్సులు ఇవ్వాలని చెప్పామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ సభలో ప్రభుత్వానికి ఏవైనా సూచనలు.. సలహాలు ఇస్తారని భావించామని.. కానీ అలా జరగలేదన్నారు సీఎం.
ప్రతిపక్ష అయిన కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని.. ఆ పార్టీ నేతలకు ప్రజా సమస్యలు పట్టవా అని సీఎం ప్రశ్నించారు. ప్రజాసమస్యలను పట్టించుకోకుండా.. ఫాంహౌస్లో ఉంటూ.. రాబోయే తరాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని కేసీఆర్ను సీఎం ప్రశ్నించారు. వచ్చే పదేళ్లు తామే అధికారంలో ఉంటామని.. కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితం అవుతారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను.. గత పదేళ్లు కోతుల గుంపునకు ఇచ్చినట్లైందంటూ సీఎం తీవ్ర విమర్శలు చేశారు. ఏ అంశంపై నైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం రేవంత్.. కేసీఆర్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తమ నిర్ణయాల్లో ఏవైనా లోపాలుంటే చెప్పాలన్నారు. పదేళ్లు మీరు దోచుకుని.. మమ్మల్ని తెలంగాణ ద్రోహులు అంటారా అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యోగం ప్రజలు ఎందుకు పీకేశారో అర్థం కాలేదా అని అన్నారు.
కేసీఆర్.. అధికారంలో ఉంటేనే పనిచేస్తారా.. అధికారంలో లేకపోతే గాలికొదిలేసి పోతారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ తెచ్చిన ఏ పథకం ఆగిందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం, రుణమాఫీ, ఉద్యోగాలపై చర్చిద్దామని.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం సవాల్ చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కేసీఆర్కు కనిపించడం లేదా అని సీఎం ప్రశ్నించారు.