Waqf Bill | లోక్ స‌భ‌లో వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు – వాడివేడిగా చ‌ర్చ‌…

న్యూఢిల్లీ – వ‌క్ఫ్ బిల్లులో స‌వ‌ర‌ణ‌లు చేయ‌క‌పోతే భ‌విష్య‌త్ లో పార్ల‌మెంట్ స్థ‌లం కూడా వ‌క్ఫ్ దే అంటార‌ని అన్నారు పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు . నేడు చారిత్రాత్మక వక్ఫ్ స‌వ‌రణ బిల్లును మంత్రి కిరణ్ రిజిజు బిల్లును లోక్ సభ ముందుంచారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి నిప్పులు చెరిగారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్, విమానాశ్రయ భూములను వక్ఫ్ ఇచ్చేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్‌ని వక్ఫ్ స్వాధీనం చేసుకోవడాన్ని ఆపేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టానికి చేసిన మార్పులు ఇతర చట్టాల కన్నా అధిక ప్రభావం చూపించినందున వక్ఫ్ బిల్లుకు కొత్త సవరణలు అవసరమని రిజిజు అన్నారు.

ఈ బిల్లు వల్ల ముస్లింలకు వచ్చే నష్టమేమీ లేదని, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు తెలుసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉంటే ఢిల్లీలోని కీలక స్థలాలు వక్ఫ్ సొంతమయ్యేవని అన్నారు. 123 ఆస్తుల్ని కాంగ్రెస్ వక్ఫ్ బోర్డుకు కట్టబెట్టిందని చెప్పారు. వక్ఫ్ చట్టంలోని లోపాలు అనేక ఉల్లంఘనలకు కారణమైందని అన్నారు. ఈ బిల్లు పేద ముస్లింలు, పిల్లలు, మహిళలకు ప్రయోజనాలు చేకూరుస్తుందని, వక్ఫ్ బోర్డు కింద ఆస్తుల నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధారిస్తుందని కిరణ్ రిజిజు వెల్లడించారు.

1970 నుండి ఢిల్లీలో పార్లమెంట్ భవనంతో సహా అనేక ఆస్తులకు సంబంధించిన కేసులు నడుస్తున్నాయని, ఢిల్లీ వక్ఫ్ బోర్డు వీటిని క్లెయిమ్ చేసింది, ఈ కేసు కోర్టులో ఉంది, అప్పటి యూపీఏ ప్రభుత్వం 123 ఆస్తుల్ని డీనోటిఫై చేసి వక్ఫ్ బోర్డుకు ఇచ్చిందని కిరణ్ రిజిజు అన్నారు. ఈ రోజు ఈ బిల్లు ప్రవేశపెట్టకపోతే, మనం కూర్చున్న పార్లమెంట్ కూడా వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేస్తారని అన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి రాకుంటే మిగతా ఆస్తుల్ని కూడా వక్ఫ్ బోర్డుకు అప్పగించేవారని ఆయన చెప్పారు.

రాజ్య‌స‌భ‌లో రేపు…

ఇక రేపు రాజ్యసభలో బిల్లుపై చర్చ కొనసాగుతుంది. ప్రతీ సభలో చర్చించడానికి 8 గంటలు కేటాయించారు.తొలిసారిగా 1954లో ”వక్ఫ్ చట్టాన్ని” పార్లమెంట్ ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేసి, వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలు ఇస్తూ 1995లో కొత్త వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఏ ఆస్తినైనా ”వక్ఫ్ ఆస్తులు”గా ప్రకటించే అపరిమిత అధికారాలను వక్ఫ్ బోర్డులకు కట్టబెడుతూ 2013లో మరోసారి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది.
ప్రస్తుతం తీసుకువస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు 2025ని “యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ , ఎంపవర్ మెంట్, ఎఫీసియన్సీ, అండ్ డెవలప్మెంట్ ( ఉమీద్) బిల్లు”గా పిలుస్తారు. ప్రస్తుతం దేశం మొత్తం 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 9.4 లక్షల ఎకరాలు ఉన్నాయి.

డిజిటలైజేషన్, సమర్థవంతంగా జమా ఖర్చుల నిర్వహణ, పారదర్శకతను పెంపొందించడం, అక్రమంగా ఆక్రమించిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు న్యాయ, చట్టపరమైన వ్యవస్థలను రూపొందించడం లాంటి సంస్కరణలను ఈ చట్టంలో ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లును గతేడాది వర్షాలకు సమావేశాలకు ముందు ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చారు, అయితే విపక్షాలు అభ్యంతరం తెలపడంతో దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపించింది. జేపీసీ 14 సవరణలను ఆమోదించింది. విపక్షాలు ప్రతిపాదించిన 44 సవరణలు తిరస్కరించింది.


.అయితే, ముస్లింయేతరులను వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేర్చడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ , రాష్ట్ర వక్ఫ్ బోర్డుల కూర్పును మార్చాలనే ప్రతిపాదన వివాదాస్పదమైంది. ఇది స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లు ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ దే అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసేది, దీని వల్ల చాలా ప్రాంతాల్లో వివాదాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కొత్త చట్టం ద్వారా యాజమాన్య హక్కులను రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి నిర్ణయిస్తారు. బిల్లు ప్రకారం, జిల్లా కలెక్టర్లకు అప్ప‌గించారు. చెప్పాలంటే, వివాదాల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం.
ఈ బిల్లును విప‌క్షాలు వ్య‌తిరేకిస్తున్నాయి… రెండు స‌భ‌లోలోనూ బిల్లును అడ్డుకోవాల‌ని ఇప్ప‌టికే విప‌క్షాలు నిర్ణ‌యించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *