న్యూ ఢిల్లీ – ఉప రాష్ట్రపతిగా తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయకు అవకాశం కల్పించాలని ఎన్డీఎ కూటమిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.. ఆయన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేస్తే తాను ఇండియా కూటమి నేతలతో మాట్లాడాతానని అన్నారు.. ఢిల్లీలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, దత్తాత్రేయకు ఆ పదవి ఇస్తే బిసిలకు, తెలుగు ప్రజలకూ న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
.బీసీలకు కేసీఆర్ అన్యాయం చేశారు..
ఒక వర్గం పేరు చెప్పి తెలంగాణలో బీసీ రిజర్లేషన్లపై బీజేపీ మొండి వాదనను తెరపైకి తీసుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్న వాళ్లే సందేహాలను లేవనెత్తుతున్నారని కామెంట్ చేశారు. తెలంగాణలో సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని.. కేంద్ర త్వరగా రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే.. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని కుండబద్దలు కొట్టారు. మూడు రైతు వ్యతిరేక చట్టాల విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారని, రైతు చట్టాల రద్దు స్ఫూర్తిగా బీసీ రిజర్వేషన్ల చట్టం ఆమోదం కోసం పోరాడుతామని అన్నారు. ముస్లింల పేరుతో మరోసారి భావోద్వేగ రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తోందని.. తాము కల్పించే రిజర్వేషన్లలో మతం ప్రస్తావనే లేదని అన్నారు. బీసీలకు అన్యాయం చేసేలా గతంలో కేసీఆర్ పంచాయతీ రాజ్ చట్టానికి సవరణలు చేశారని, కానీ, తాము సామాజిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించ ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
బిల్లును వెంటనే ఆమోదించాల్సిందే
తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల బిల్ ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని కేంద్రంపై విరుచుకుపడ్డారు రేవంత్ . విద్య ఉపాధి అంశాలతో పాటు, స్థానిక సంస్థల రిజర్వేషన్ల రెండు బిల్లులను ఆమోదించడం లేదన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవని.. మతాలు ప్రాతిపదిక కాదన్నారు. వెనుకబాటు తనమే తమ ప్రాతిపదిక అని స్పష్టం చేశారు.
దీనిపై రేపు ఉదయం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలుస్తామని తెలిపారు.. సర్వే వివరాలు వివరిస్తామని స్పష్టం చేశారు. తమ తరఫున పార్లమెంట్ లో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరతామన్నారు. రేపు సర్వే కోసం జరిగిన ప్రక్రియ పై కాంగ్రెస్ ఎంపీలకు వివరిస్తామని వెల్లడించారు. జనగణనలో కుల గణన చేర్చాలని.. జనగణనలో కులగణన ఎలా చేయొచ్చు.. దేశానికి తెలంగాణ మోడల్ గా నిలిచిందో వివరిస్తామన్నారు. తాము చేసిన సర్వే దేశానికి రోల్ మోడల్ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తమ కార్యాచరణ సిద్ధం చేశామని వెల్లడించారు. కేంద్రం రిజర్వేషన్లను ఆమోదించాలని.. అందుకే కేంద్రం పై ఒత్తిడి తేవాలన్నారు. అవసరం అయితే కూటమి నేతలను కూడా కలుస్తామని చెప్పారు.
సోషల్ జస్జీస్ కోసం అందరూ సహకరించాలి..
సోషల్ జస్టిస్ కు అందరూ సహకరించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. “గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అక్కడ ముస్లిం రిజర్వేషన్లు తొలగించి బీజేపీ నేతలు తెలంగాణ గురించి మాట్లాడాలి. బీజేపీ నేతలు వితండ వాదం చేస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తాం అని అమిత్ షా అన్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా..? కేంద్రం తక్షణమే బిల్లును ఆమోదించాలి. సర్వేను శాసన సభలో ప్రవేశ పెట్టి పూర్తి స్థాయిలో చర్చకు అవకాశం ఇచ్చాం. వ్యక్తుల వ్యక్తిగత వివరాలను బహిరంగ పరచలేదు. 3.9 శాతం ప్రజలు తమకు ఏ కులం లేదని డిక్లేర్ చేశారు. ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను రోడ్ పై పెట్టలేం. ఫస్ట్ క్యాబినెట్ ముందు పెట్టాలి. శాసన సభలో ప్రశ్నిస్తే.. సమాధానం చెప్తాం. అడిగిన వివరాలు ఇస్తాం. పబ్లిక్ డొమైన్ లో పెట్టేటప్పుడు.. అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తాం. క్యాబినెట్లో చర్చించి, శాసన సభలో ప్రవేశ పెడతాం. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. మతాలు ప్రాతిపదిక కాదు. వెనుకబాటు తనమే మా ప్రాతిపదిక. బీజేపీ తొండి వాదన చేస్తోంది. తమ దగ్గర రీసెర్చ్ అండ్ అనాలసిస్ వివరాలు ఉన్నాయి. కేంద్రం బిల్లును ఆమోదించకపోతే, ఒత్తిడి తెచ్చేందుకు మా వ్యూహం మాకుంది.” అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.