Visakha | మరో 24 గంటల్లో డెలివరీ …భర్త చేతిలో భార్య‌ హతం

విశాఖపట్నం: విశాఖ మధురవాడలో దారుణ ఘటన వెలుగు చూసింది. నిండు గర్భిణీని చంపేశాడో దుర్మార్గపు భర్త. విశాఖ జిల్లాకు చెందిన గెద్దాడ జ్ఞానేశ్వరరావు, అనూష రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ ఒంటరిగా మధురవాడ పీఎం పాలెం ఊడా కాలనీలో నివాసం ఉంటున్నారు. స్కౌట్స్, సాగర్ నగర్ వ్యూ పాయింట్ వద్ద జ్ఞానేశ్వర్ రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనూష గర్భం దాల్చింది. మరో 24 గంటల్లో ప్రసవించనుంది.


అయితే వారిద్దరి మధ్య కొన్ని నెలలుగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో అప్పుడప్పుడూ గొడవపడేవాడు. అయితే సోమవారం ఉదయం సైతం వారి మధ్య వివాదం తలెత్తింది. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. గర్భిణీ అనే విషయం మరిచి రెచ్చిపోయిన అతను భార్యపై దాడి చేశాడు. ఆమె గొంతు నులిమి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తన బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి అనూషకు ఆరోగ్యం బాగోలేదని చెప్పాడు. వెంటనే రావాలని కోరాడు. దీంతో హుటాహుటిన వారందరూ అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు సదరు యువతి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. దీంతో అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. విషయం కాస్త అనూష తల్లిదండ్రులకు చేరింది. ఆస్పత్రి వద్దకు వచ్చిన యువతి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనూషను తానే గొంతు నులిమి హత్య చేసినట్లు జ్ఞానేశ్వరరావు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *