Utkoor | ప్రయాణికుల పాట్లు..

Utkoor | ప్రయాణికుల పాట్లు..
- డ్రైనేజీపై కూలిన కప్పును ఏర్పాటు చేయండి మహాప్రభో..
Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలో ప్రధాన రహదారి పెద్ద డ్రైనేజీపై వేసిన పైకప్పు (మినీ బ్రిడ్జి) ఏడాది క్రితం కూలింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ రహదారిపై ప్రతి నిత్యం ఆంజనేయ స్వామి దేవాలయానికి భక్తులు రావడంతో పాటు ఎల్బీనగర్, గద్వాలగేరి, శ్రీనివాస కాలనీ, భరత్ నగర్, శ్రీరామ్ నగర్, పాతపేట కుర్వ వీధికి తోపాటు బస్టాండ్కు రోజు వందలాదిమంది ప్రయాణికులు ఈ రహదారిపై వెళ్తుంటారు.
డ్రైనేజీ పైకప్పు నిర్మించాలని గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ సంఘటనపై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావును ఆంధ్రప్రభ వివరణ కోరగా త్వరలోనే పనులు చేపడతామన్నారు.
