UPI | ఆగస్టు నుంచి అన్ని పోస్టాఫీసుల్లో డిజిటల్ చెల్లింపులు

యూపీఐ ఆధారిత డైనమిక్ క్యూఆర్ కోడ్ ద్వారా సేవలు
‘ఐటీ 2.0’ టెక్నాలజీతో వ్యవస్థను ఆధునీకరిస్తున్న తపాలా శాఖ
కర్ణాటకలోని మైసూరు, బాగల్‌కోట్‌లో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం
గతంలో విఫలమైన స్టాటిక్ క్యూఆర్ కోడ్ స్థానంలో కొత్త విధానం

న్యూ ఢిల్లీ – దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో (Post offices ) నగదు ( Cash ) చెల్లింపుల విధానానికి స్వస్తి పలికి, డిజిటల్ (digital ) లావాదేవీలకు మార్గం సుగమం అవుతోంది. 2025 ఆగస్టు నాటికి భారతదేశంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు తపాలా శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ ఆధునిక మార్పుతో వినియోగదారులు పోస్టల్ సేవలకు సులభంగా, సురక్షితంగా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

పోస్టాఫీసుల్లో ప్రస్తుతం ఉన్న సాంకేతిక వ్యవస్థకు యూపీఐతో అనుసంధానం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు తపాలా శాఖ తమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యవస్థను ‘ఐటీ 2.0’ పేరుతో అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ప్రతి లావాదేవీకి ప్రత్యేకంగా ఒక ‘డైనమిక్ క్యూఆర్ కోడ్’ జనరేట్ అవుతుంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్లతో ఈ కోడ్‌ను స్కాన్ చేసి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చెల్లింపులు పూర్తిచేయవచ్చు.

ఈ నూతన విధానాన్ని అమలు చేయడానికి ముందు, కర్ణాటకలోని మైసూరు, బాగల్‌కోట్ హెడ్ పోస్టాఫీసులతో పాటు పలు చిన్న కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగంలో భాగంగా మెయిల్ ప్రొడక్టుల బుకింగ్ కోసం క్యూఆర్ కోడ్ చెల్లింపులను విజయవంతంగా పరీక్షించారు. ఈ ఫలితాల ఆధారంగా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని పోస్టాఫీసుల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. ప్రతి లావాదేవీకి కొత్త కోడ్ జనరేట్ అవ్వడం వల్ల మోసాలకు ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది.

ఈ చొరవతో ప్రతిరోజూ పోస్టాఫీసులను సందర్శించే లక్షలాది మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. పోస్టేజ్, పార్శిల్ సేవలతో పాటు పొదుపు పథకాల డిపాజిట్ల కోసం కూడా డిజిటల్ పద్ధతిలో సులభంగా చెల్లించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ‘నగదు రహిత భారత్’ లక్ష్య సాధనలో ఈ అడుగు ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply