(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : రాష్ట్ర నవ్య రాజధాని అమరావతికి గేట్వే నగరమైన విజయవాడకు గుర్తింపు తెచ్చేందుకు నిర్వహించిన బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని, వినూత్న ఆలోచనలతో నూతన ఒరవడిని జతచేసి 200మందికి పైగా తమ ఎంట్రీలను పంపారని, ఔత్సాహికులకు మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఎంట్రీలకు మే10న చివరి తేదీగా నిర్ధారించినట్లు జరిగిందని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు.
విజయవాడ బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీల నిర్వహణపై శనివారం జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ మాట్లాడుతూ… రాష్ట్ర నవ్య రాజధాని అమరావతికి గేట్వే నగరమైన విజయవాడకు దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించి, సరైన గుర్తింపు తెచ్చేందుకు బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీలను నిర్వహించాలనే ఆలోచన రావడం జరిగిందన్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే విధంగా నగరంపై ఉన్న ఆసక్తిని, ఆలోచనలను ప్రతిబింబించేలా టైటిల్, ట్యాగ్లైన్లను సూచించాలని, ఔత్సాహికుల నుంచి ఎంట్రీలను ఈ-మెయిల్ ద్వారా పంపాలని కోరామన్నారు. దరిమిలా ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా ఎంట్రీల ద్వారా అత్యద్భుతమైన టైటిళ్లను, ట్యాగ్లైన్లను ఔత్సాహికులు సూచించారన్నారు. వాటిని పరిశీలించడంతో మరింత ఉత్సాహం పెరిగి, మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మే10వ తేదీ ఎంట్రీలకు చివరితేదీగా నిర్ధారించామన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బ్రాండ్ టైటిల్, ట్యాగ్లైన్ను Brandvjacomp.collectorntrdist@gmail.com మెయిల్ ఐడీకి పంపాలని, దీంతో పాటు పంపిన వారి పేరు, చిరునామా, మొబైల్ నంబరును తెలియజేయాలన్నారు. గడువు తేదీ అనంతరం విజయవాడ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేలా అత్యుత్తమమైన టైటిల్, ట్యాగ్లైన్లను ఎంపిక చేయడం జరుగుతుందని, విజేతలకు ప్రశంసాపత్రం, బహుమతులతో పాటు వారికి సముచిత గుర్తింపు కల్పిస్తామన్నారు. పోటీల్లో పాల్గొని ఎంట్రీలు పంపిన ప్రతిఒక్కరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.