Tunnel Collapse | ప్రాణాలు కాపాడ‌టం కంటే ఎన్నిక‌ల ప్ర‌చారంపైనే మ‌క్కువ – రేవంత్ పై కెటిఆర్ ఫైర్

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌: రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు.. ట‌న్నెల్ ప్ర‌మాదంలో ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి, గ్రాడ్యూయేట్స్‌కు గాలం వేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి ప్ర‌చారానికి సిద్ధమయ్యారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయమేనని మండిపడ్డారు. జరిగిన ఘోర దుర్ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రికే సీరియస్‌నెస్ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటది, రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతదని ప్రశ్నించారు.

స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ ఏదీ..

ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ.. ఒక్కసారి క్షతగాత్రుల ఆర్థనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు వెళ్లే టైమ్ లేదా? అని కేటీఆర్‌ నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? అంటూ ధ్వజమెత్తారు. ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓవైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే, ఇరుక్కున వారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కారు చేతులెత్తేస్తున్న తీరు, మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే మా తొలి ఎజెండా అనే ముఖ్యమంత్రి, సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా అన్నారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు, ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యూయేట్స్ కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాత పెడ్తారని ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *