Tributes | శ్ర‌మ‌దోపిడికి వ్య‌తిరేకంగా పోరాడిన కార్మిక నేత నాయిని – కెటిఆర్

హైద‌రాబాద్ – కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన నేత నాయిని నాయిని నరసింహారెడ్డి అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నేడు నాయిని నరసింహారెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నాయిని చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.. అనంత‌రం కెటిఆర్ మాట్లాడుతూ, రెండు దశాబ్దాల పాటు నాయిని కేసీఆర్‌కు సోదరుడిలా కలిసి పని చేశారన్నారు. ఉద్యమ కాలంలో పార్టీ నేతలందరికీ స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా నిలిచారన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రిగా అనేక సేవలు అందించారని గుర్తు చేశారు.

ఏడుపదుల వయసులో కూడా యువకుల మాదిరిగా ఉత్సాహంగా జీవితం గడిపారని.. 85వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. నాయిని లేకపోవడం లోటైనప్పటికీ, ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకోవడం గర్వకారణమని చెప్పారు. ఉద్యమ కాలంలో అనేక కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నానని.. ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల్లో ఆయన కలిసి తిరిగిన రోజులను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఉద్యమ కేసులను వెనక్కి తీసుకునేలా హోంశాఖ మంత్రిగా ధర్మవంతమైన బాధ్యతను నాయిని నిర్వహించారని తెలిపారు. నాయిని నరసింహారెడ్డి కార్మిక హక్కుల పక్షపాతని, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన నాయకుడన్నారు.

రాజకీయాల్లో ఆస్తులకంటే పేరు, గౌరవం సంపాదించిన అరుదైన నాయకుడని తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ నిర్ణయంపై అమెరికాలో నుంచే తన చేతిరాత రాజీనామాను గవర్నర్‌కి పంపించారని.. మంత్రి పదవిని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా త్యాగం చేసిన మహానేత అని కొనియాడారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టాలని కేసీఆర్ సూచించారని గుర్తు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం, హైదరాబాద్‌ నగరానికి అందించిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఇచ్చారని.. పార్టీ కోసం దశాబ్దాల పాటు సేవలు అందించిన నాయిని కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు.

Leave a Reply