Tributes | సాంఘీక సమానత్వ సాధనే మహాత్మా ఫూలే కు నిజమైన నివాళి: సింగరేణి సీఎండీ బలరామ్

హైదరాబాద్ – మహాత్మా జ్యోతిరావ్ ఫూలే మహిళా విద్య కోసం, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, సకలజనుల సామాజిక న్యాయం కోసం పోరాడారని, సమాజంలో సాంఘిక సమానత్వం సాధించి చూపటమే మహాత్మ జ్యోతిరావ్ ఫూలేకి నిజమైన నివాళి అవుతుందని సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా మహాత్మ జ్యోతిరావ్ ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.


అనంతరం ప్రసంగిస్తూ 150 సంవత్సరాలకు పూర్వమే శ్రీ జ్యోతిరావ్ ఫూలే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, మహిళల విద్య కోసం అవిశ్రాంతంగా శ్రమించారని, అణిచివేత చర్యలకు వ్యతిరేకంగా దళితుల తరఫున పోరాడారని వివరించారు. తన భార్య సావిత్రి ఫూలేకి స్వయంగా విద్య నేర్పి, మహిళ ఉద్యమానికి నాయకత్వం వహించేలా చేశారని, ఆయన గొప్ప నిస్వార్థ సంఘ సంస్కర్త, మానవతావాది అని ప్రశంసించారు. సనాతన మూఢాచారాలకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమాలు నడిపారని, అన్ని జాతుల, కులాల వారికి సాంఘిక, ఆర్థిక సమానత్వం కోసం తన జీవితాన్ని ధారపోసారని, ఆయన మహోన్నత సిద్ధాంతాలు మనకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
సభా కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) ఎస్.డి.ఎం.సుభాని అధ్యక్షత వహించి మాట్లాడారు. బీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా డీ.జీ.ఎం చౌటపల్లి ప్రభాకర్ తదితరులు ప్రసంగించారు. సింగరేణి భవన్ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *