Trade War | పాకిస్థాన్ కు మ‌రో ఝ‌ల‌క్ – దిగుమతులు నిలిపివేత‌

న్యూ ఢిల్లీ – పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం.. దీని వెనక పాక్ ఉందని ఆరోపిస్తూ ఆ దేశంపై కఠిన చర్యలు చేపట్టింది. జాతీయ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా పాకిస్థాన్ నుంచి జరిగే అన్ని రకాల దిగుమతులను తక్షణమే నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

పాకిస్థాన్ నుంచి నేరుగా గానీ లేదా పరోక్షంగా గానీ వచ్చే అన్ని రకాల వస్తువుల దిగుమతులపై ఈ నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మేడిన్ పాకిస్థాన్ వస్తువులకు భారత్ లో చోటులేదని, అక్కడి నుంచి ఎగుమతి అయిన ఏ వస్తువునైనా భారత్‌లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం రవాణా మార్గంలో ఉన్న సరుకులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది.

“పాకిస్థాన్ మూలం ఉన్న లేదా అక్కడి నుంచి ఎగుమతి అయిన ఏ వస్తువైనా సరే భారతదేశంలోకి అనుమతించబోం.. అన్ని వస్తువుల దిగుమతి లేదా రవాణాపై నిషేధం అమలు చేస్తున్నాం. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ ఆంక్షలు విధించబడ్డాయి” అని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో వివరించింది. అత్యవసర పరిస్థితుల్లో ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.

Leave a Reply