హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో జరిగే రెండో మ్యాచ్ కోసం ఇరుజట్ల అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించాలని ఆశపడుతున్నారు. ఈ మ్యాచ్ టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో విక్రయించగా నిమిషాల వ్యవధిలో అమ్ముడయ్యాయి. చాలా మంది అభిమానులు టికెట్లు దొరకక నిరాశకు గురయ్యారు. ఈ డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు టికెట్లు దక్కించుకున్న కొంతమంది కేటుగాళ్లు వాటిని బ్లాక్ లో అమ్ముతున్నారు.
టికెట్ల కోసం ఉప్పల్ స్టేడియానికి వచ్చి వెళుతున్న వారికి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఈనేపథ్యంలోనే శనివారం ఉప్పల్ మెట్రో వద్ద భరద్వాజ్ బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ వెంటనే భదద్వాజ్ ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న నాలుగు టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. భరద్వాజ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బ్లాక్ లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.