మధుబని – బీహార్ : పహల్గామ్ ఉగ్రవాదులకు ఊహించని విధంగా శిక్షలు విధిస్తామని ప్రధాని మోదీ అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి బీహార్లోని మధుబనిలో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీహార్ లోని రూ.869కోట్ల రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ మృతుల కోసం 2నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. పహల్గామ్ ఘటన తర్వాత దేశమంతా దు:ఖంలో మునిగిపోయిందన్నారు.
ఈ ఉగ్రదాడిలో ఎంతో మంది మహిళలు.. తమ భర్తలను కోల్పోయారని.. వారందరికీ దేశమంతా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల్లో అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారని చెప్పారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే సమయం ఆసన్నమైందన్నారు. ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తున్నామని.. వారికి సహకరించిన వారిని కూడా వదిలిపెట్టబోమని మోడీ హెచ్చరించారు.
ఇది దేశంపై దాడే..
దేశం దుఃఖంలో ఉంది. ఈ దాడి పర్యాటకులపై దాడి కాదు దేశంపై దాడి. ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను, దాని వెనుక ఉన్నవారికి ఊహించిన దానికంటే ఎక్కువ శిక్ష పడుతుంది. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. ప్రపంచానికి తెలియజేస్తున్నా ఉగ్రవాదులను వదిలిపెట్టం. న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. భారత్ కు మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాలకు కృతజ్ఞతలు అని ప్రధాని మోదీ అన్నారు.
ఆ తర్వాత బిహార్ లో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. వివాదాల పరిష్కారంలో భూమి పత్రాల డిజిటలైజేషన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. స్వతంత్రం తర్వాత దేశానికి కొత్త పార్లమెంట్ భవనం వచ్చిందని, 30వేల కొత్త పంచాయతీ భవనాలు కూడా నిర్మించినట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు నిధులు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత, ఇది గ్రామాల అభివృద్ధికి దారితీసిందన్నారు.
అంతకంటే ముందు.. ప్రధాని మోదీకి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ తర్వాత సీఎం నితీష్ మాట్లాడుతూ.. పంచాయతీల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించామని సీఎం నితీష్ కుమార్ అన్నారు. ప్రగతి యాత్ర ద్వారా ఇటీవల బిహార్లో జరిగిన పనులను పరిశీలించామని ఆయన అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో బిహార్లో అనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రోడ్డు పథకం, వరద నియంత్రణ, ఆరోగ్యం కోసం పెద్ద ప్రకటనలు చేసింది. మఖానా బోర్డును ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీ గురించి వ్యాఖ్యానిస్తూ, అది చాలా గందరగోళంగా మారిందని, మనం ఎప్పటికీ దానితో ముందుకు సాగలేమని సీఎం నితీష్ అన్నారు. అనంతరం బిహార్లో రూ.869 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రజలకు ఇళ్ల తాళాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందజేశారు.