మూడో విడత గ్రామ పంచాయతీల ఎన్నికలు..

- అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
- ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
- మల్కాపురంలో ప్రత్యేక బలగాలతో రూట్ మార్చ్ నిర్వహించిన పోలీసులు
- చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలో ఈనెల 17వ తేదీన జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలోని 26 గ్రామపంచాయతీలు, 236 వార్డులకు గాను మూడు గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలు, 21 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 23 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు 59 మంది, 215 వార్డు సభ్యుల స్థానాలకు 517 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు పోలింగ్ జరగనుంది. అధికారులు భోజనం తర్వాత రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభించి ఎప్పటికప్పుడు ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు.
చౌటుప్పల్ ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్, చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు ఆధ్వర్యంలో గ్రామాలలో 144 సెక్షన్ విధించి తగిన బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాగా మండలంలో అతిపెద్ద గ్రామ పంచాయతీ దండు మల్కాపురం గ్రామంలో ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా ఉండేందుకు కానీ ముందస్తుగా మంగళవారం రోజు ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో పాటు ఆర్మీ ఫోర్సు ను ఏర్పాటుచేసి రూట్ మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలలో అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. అన్ని గ్రామాలలో పర్యవేక్షణ కోసం అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు.
