ముంబై : యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్–2025 కోసం భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జాబితాను ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపిక చేశారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ యశస్వి జైస్వాల్కు చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
అలాగే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్కి విశ్రాంతి ఇవ్వగా, కేఎల్ రాహుల్ కూడా జట్టులో లేకపోవడం గమనార్హం. మరోవైపు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ జట్టులోకి తిరిగి రావడం సంతోషకరం. యువ బ్యాటర్ రింకూ సింగ్ ఆశ్చర్యకరంగా అవకాశాన్ని దక్కించుకున్నాడు.
ఆసియా కప్ షెడ్యూల్
సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరిగే ఈ టోర్నీలో 8 జట్లు పోటీ పడతాయి. గ్రూప్–ఎలో ఉన్న భారత్ సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. తర్వాత సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో హై వోల్టేజ్ పోరు, సెప్టెంబర్ 19న ఒమన్తో చివరి గ్రూప్ మ్యాచ్ జరగనుంది.
భారత జట్టు :
ప్రధాన జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా.
స్టాండ్బై ప్లేయర్లు :
యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ద్ కృష్ణ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్.