మ‌త్తులో మెడికోలు చిత్తు

  • ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్‌

లేటెస్ట్‌గా హైదరాబాద్‌లోని రిసాలబజార్‌ కేంద్రంగా సాగుతున్న మత్తు దందాను తెలంగాణ ‘ఈగల్‌’ పోలీసులు(Telangana ‘Eagle’ police) ఛేదించారు. ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిలో ఇద్దరు పెడ్లర్లతో పాటు 81 మంది వినియోగదారులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుల్లో నగరంలోని ఓ వైద్య కళాశాల(medical college
) కు చెందిన కొంతమంది వైద్య విద్యార్థులు ఉన్నారు. కొందరిని పరీక్షించగా పాజిటివ్‌గా తేలడం, వారిలో ఇద్దరు యువతులు ఉండటం గమనార్హం.

ఎలా ప‌ట్టుకున్నారంటే..?
హైదరాబాద్​లోని బొల్లారం రిసాలబజార్​లోని పాఠశాల మైదానానికి తరచుగా ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై అక్కడి వినియోగదారులకు గంజాయి అమ్ముతున్నట్లు హైదరాబాద్​ ఈగల్​ విభాగానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడ పోలీసులు వారి కోసం మాటువేశారు. ఈ క్రమంలోనే ఓ బైక్​పై అనుమానాస్పదంగా వచ్చిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. అతడి వద్ద 2 కిలోల గంజాయి దొరికింది. నిందితుడిని రిసాలబజార్‌కు చెందిన అరాఫత్‌ అహ్మద్‌ ఖాన్‌ (23)గా గుర్తించారు.

బీద‌ర్ నుంచి గంజాయి తెచ్చి…
ఇతడు రెండు సంవత్సరాలుగా కర్ణాటకలోని బీదర్‌లో జరీనా బాను వద్ద గంజాయి కొని నగరంలో అమ్ముతున్నట్లు తేలింది. అరాఫత్‌ అహ్మద్‌ ఖాన్‌ ఇచ్చిన సమాచారంతో ఈగల్‌ బృందాలు జరీనా బానును ఇటీవల బీదర్‌లో అదుపులోకి తీసుకున్నాయి. ఆమె బ్యాంకు అకౌంట్​ను పరిశీలించగా, సంవత్సరం కాలంగా జరిగిన రూ.1.5 కోట్ల లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో రూ.26 లక్షలు హైదరాబాద్‌కు చెందిన 51 మంది గంజాయి వ్యాపారులు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్‌లో నమోదైన రెండు గంజాయి కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉంది. ఆమె వద్ద అరాఫత్‌ఖాన్‌ రూ.6 లక్షల లావాదేవీలు జరిపాడు.

ఓ వైద్య కళాశాలకు చెందిన 32 మంది విద్యార్థులు
అరాఫత్‌ అహ్మద్‌ ఖాన్‌ వద్ద దాదాపు 100 మంది గంజాయి కొంటున్నట్లు ఈగల్‌ డీఎస్పీ నర్సింగ్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు విచారణలో గుర్తించారు. ఇందులో ఓ వైద్య కళాశాలకు చెందిన 32 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 24 మందిని పరీక్షించగా ఇద్దరు యువతులు సహా 9 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరంతా కళాశాల వసతి గృహంలో ఉంటున్నారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి డీ-అడిక్షన్‌ కేంద్రానికి పంపించారు. మిగిలిన 8 మంది గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply