
world cup | మరో మూడు రోజుల్లో..
world cup | మరో మూడు రోజుల్లో..
- పొట్టి ప్రపంచకప్ ప్రారంభం
- ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నీ
- పోటీ పడుతున్న 20 జట్లు
- డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి భారత్
- మూడో కప్ కొట్టాలని టీమిండియా
world cup | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : పొట్టి సమరానికి సమయం దగ్గర పడుతోంది. ఈ ప్రపంచ కప్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఈ ట్రోఫీ కోసం 20 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ టోర్నమెంట్లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో టీమ్ఇండియా కప్ మరోసారి కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

రెండు సార్లు కప్ కొట్టిన భారత్
టీమిండియా 2007లో మొదటి ప్రపంచకప్ను గెలిచింది. సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఆ టోర్నీలో ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని యువ జట్టు అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి మొట్టమొదటి టీ20 ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత 17ఏళ్లకు 2024లో వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగిన వరల్డ్ కప్లో భారత్ అజేయంగా నిలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ఇండియా సౌతాఫ్రికాను ఫైనల్లో ఓడించి రెండోసారి పొట్టి కప్పును ముద్దాడింది.
మూడోది దక్కేనా..?
టీ20 వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏజట్టు కూడా టైటిల్ను నిలబెట్టుకోలేదు. అలాగే మూడుసార్లు ఛాంపియన్గానూ నిలవలేదు. భారత్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ రెండుసార్లు కప్ గెలిచాయి. ఇప్పుడు మూడోసారి గెలిచేందుకు ఈ జట్లు తహతహలాడుతున్నాయి. ఈసారి భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్కు మూడోసారి ఛాంపియన్గా నిలిచే అవకాశం ఉంది.
