Peddapally | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం : మంత్రి సీతక్క

పెద్దపల్లి రూరల్, జులై 16(ఆంధ్రప్రభ): రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క (Seethakka) తెలిపారు. పెద్దపల్లి (Peddapally) పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో బుధవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ… మహిళలకు ఇచ్చిన హామీలు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నామన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు (Government Hostels), పాఠశాలల్లో విద్యార్థులకు అందించే 60లక్షల యూనిఫారాలు మహిళా సంఘాలకు కుట్టేందుకు ఇచ్చి రూ.30 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. మహిళా క్యాంటీన్లు (Women’s canteens), ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, మహిళా సంఘాలకు కేటాయించిన బస్సులను ఆర్టీసీకి అద్దె ఇవ్వడం, వడ్డీ లేని రుణాలు వంటి అనేక మహిళా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని, మహిళల ఆర్థిక అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao), ఐటీ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) మాట్లాడారు. అనంతరం జిల్లాలోని మహిళా సంఘాలకు కేటాయించిన 9 బస్సులను ప్రారంభించారు. జిల్లాలోని మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి రుణాలు, వడ్డీ బకాయిలు చెల్లించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణ రావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, తదితరులు పాల్గొన్నారు.
