హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. గత సంవత్సరం అక్టోబర్లో గ్రూప్-1 పరీక్షలను నిర్వహించిన టీజీపీఎస్సీ, ఈ సంవత్సరం మార్చి 10న తాత్కాలిక మార్కులను వెల్లడించింది. ఇప్పుడు తాజాగా జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసి, అందరికీ అందుబాటులోకి తెచ్చింది.
టాప్ టెన్లో ఆరుగురు మహిళలు ఉండగా, నలుగురు పురుష అభ్యర్థులు ఉన్నారు. 900 మార్కులకుగాను 550 మార్కులతో జనరల్ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థి టాపర్గా నిలిచారు. టాప్ 10లో బీసీలు ముగ్గురు మాత్రమే ఉండగా, మిగిలినివారంతా ఓసీ అభ్యర్థులే కావడం విశేషం. కాగా, రీకౌంటింగ్ పెట్టుకున్న వారికి ఒక్క మార్కు కూడా పెరగని కూడా పెరగలేదు.
గ్రూఫ్-1లో గుంటుపల్లి వాసికి 70 ర్యాంకు

చిట్యాల, : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ – 1 ఫలితాల్లో జయ శంకర్ జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్డి, గోపి కృష్ణ ,రాష్ట్ర స్థాయి లో 70 వ ర్యాంక్ సాధించాడు. గుంటూరు పల్లి కి చెందిన వెల్డి నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు గోపికృష్ణ మారుమూల గ్రామం నుండి గ్రూప్- 1 లో ర్యాంకు తీసుకు రావడంపట్ల పలువురు అభినందిస్తున్నారు.
ఆయనకు ర్యాంకు రావడం గర్వకారణం అని గ్రామ మాజీ సర్పంచ్ పువ్వాటి రాణి వెంకటేశ్వర్లు , గ్రామ ప్రజలు, హర్షం వ్యక్తం చేస్తు గోపి కృష్ణకు అభినందనలు తెలిపారు. కాగా ఆరు నెలల క్రితం గోపికృష్ణ తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు.
పెద్దపల్లి వాసికిగ్రూప్-1లో 76వ ర్యాంకు

పెద్దపల్లి రూరల్, : గ్రూప్ – 1 లో పెద్దపల్లి పట్టణం 3వ వార్డు హనుమాన్ నగర్ కు చెందిన పొందుగుల విజయలక్ష్మి భాస్కర్ రెడ్డి కుమారుడు సుభాషిత్ రెడ్డి కి రాష్ట్ర స్థాయిలో 76 వ ర్యాంకు (491.5 మార్కులు) వచ్చింది. టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్ ఫలితాలను వెల్లడించిన సంగతి విదితమే. వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన సుభాషిత్ రెడ్డి ప్రస్తుతం బెంగుళూరులో ఇన్కం టాక్స్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నాడు. గ్రూప్ 1లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన రైతు బిడ్డను సుభాషిత్ రెడ్డికి పలువురు అభినందించారు. సివిల్స్ సాధనే ధ్యేయం : సుభాషిత్ రెడ్ఢిసివిల్స్ సాధించాలన్నదే నా ధ్యేయం. ఇప్పటికీ రెండు సార్లు సివిల్స్ రాశా. రెండోసారి ఒకే మార్కు తేడాతో మిస్ అయ్యా. ఎప్పటికైనా సివిల్ సాధించి తీరుతా. అమ్మా నాన్నల ఆశయాన్ని నెరవేరుస్తా. 3వ సారి సివిల్ పరీక్ష రాసేందుకు సన్నద్ధమవుతున్నా. ఈ సారి ఖచ్చితంగా సివిల్ కు ఎంపికవుతానని ఆత్మ విశ్వాసం ఉంది. గ్రూప్ 1 లో 76వ ర్యాంకు రావడం సంతోషమే. కానీ సివిల్ ఫలితాల్లో ఎంపిక కావడం నా ప్రధాన ధ్యేయం.