అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం
బీఆర్ ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు
నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు తెలిపిన సుప్రీంకోర్టు
అసెంబ్లీ సెక్రెటరీ, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ
తాజా విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 25వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. జనవరి 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్పై.. పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీపై కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అన్ని పిటిషన్లను ఒకే దగ్గర కలిపి సుప్రీం ధర్మాసనం విచారణ చేపడుతోన్న విషయం తెలిసిందే.
నోటీసులు అందుకునే వారు…
ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు నోటీసులు అందాయి. అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.