ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు
ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్
సైనిక్ స్కూల్కు దీటుగా పోలీస్ స్కూల్
యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి
వంద కోట్ల కార్పస్ ఫండ్కు సహకరించాలి
కార్పొరేట్ కంపెనీలకు సీఎం రేవంత్ పిలుపు
రంగారెడ్డి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని, అలాగే యంగ్ ఇండియా తన బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని గ్రేహౌండ్ క్యాంపస్ సమీపంలోని యంగ్ ఇండియా పోలీసు స్కూల్ను ప్రారంభించారు. ఈ సందర్భగా మాట్లాడుతూ.. ₹2 కిలో బియ్యం.. ఎన్టీఆర్ బ్రాండ్ అని, హైదరాబాద్లో ఐటీ.. చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని, అలాగే రైతు బాంధవుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ సంపాదించుకున్నారని, ఈ రోజు తాను క్రియేట్ చేసిన తన బ్రాండ్ యంగ్ ఇండియా అన్నారు.
మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ను తెలంగాణలో క్రియేట్ చేసినట్ట సీఎం తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని గుర్తు చేశారు. ఆనాడు పండిట్ జవహర్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయని, నెహ్రూ దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందన్నారు. దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు.. కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారన్నారు. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయని సీఎం గుర్తు చేశారు.
తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్..
దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని సీఎం అన్నారు. అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది తమ బ్రాండ్ అన్నారు. నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆనంద్ మహీంద్రాను యూనివర్సిటీకి చైర్ పర్సన్గా నియమించుకున్నామని చెప్పారు. ఈ రోజు యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉందని, దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు.
ప్రీ స్కూల్ విధానం అమలు..
ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నామని సీఎం అన్నారు. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుతోందన్నారు. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి… ప్రీస్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
సైనిక్ స్కూల్కు దీటుగా పోలీస్ స్కూల్..
సైనిక్ స్కూల్ కు దీటుగా పోలీస్ స్కూల్ను తీర్చి దిద్దుతామని సీఎం అన్నారు. ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. పోలీస్ స్కూల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అన్నారు. సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు పోలీస్ స్కూల్ కు ఆర్ధిక సాయం అందించాలని కోరారు. పోలీస్ స్కూల్ కోసం ₹100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రతీ పోలీస్ సిబ్బందికి ఇది అత్యంత ముఖ్యమైందన్నారు.