TG | అంతిమంగా గెలిచేది న్యాయమే – హరీశ్ రావు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని, రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాయొద్దని బీఆర్‌ఎస్‌ (BRS)ఎమ్మెల్యే హరీశ్‌ రావు (Harish Rao) అన్నారు. ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడదని తెలిపారు. తమకు న్యాయం మీద నమ్మకం ఉన్నదని, అంతిమంగా న్యాయం గెలుస్తుందని చెప్పారు.

కాళేశ్వరం కమిషన్ (Kaleswaram Commission) విచారణకు హాజరయ్యే ముందు హైదరాబాద్‌ కోకాపేట్‌లోని (Koka pet)తన నివాసం వద్ద హరీశ్‌రావు మీడియాతో (Press Meet) మాట్లాడారు.

‘మొన్ననే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చాం. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ (Congress)కమిషన్ ఏర్పాటుచేసినా, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవం, విశ్వాసం ఉన్న పార్టీ బీఆర్ఎస్. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తాం. మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తా.

గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ మీద రాజకీయ కక్షతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం ఆలోచించవలసింది ఉద్దేశంతో కాదు, విజ్ఞతతో ఆలోచించాలి. రాజకీయ దుర్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి, రైతులకు అన్యాయం చేస్తుంది. విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాలరాయద్దు. రాజ్యాంగం మీద, దేవుని మీద నమ్మకం ఉంది. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. ధర్మం గెలుస్తుంది. ఈ రోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తిస్థాయిలో సమాధానం చెప్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వంలో లేము కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్లను (Document )వారికి అందిస్తాం.’ అని హరీశ్‌ రావు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *