TG | కాళేశ్వరం ప్రాజెక్ట్ విమ‌ర్శ‌ల‌పై కేటీఆర్ కౌంటర్.. రాజకీయ కుట్రలపై గట్టి విమర్శలు !

హైదరాబాద్ : తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఒకే ఎజెండాతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బద్నాం చేయాలనే రాజకీయ కుట్రలో నిమగ్నమయ్యాయని ఆయన ఆరోపించారు.

ప్రాజెక్ట్ ఏకపక్ష నిర్ణయం కాదు..

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక వ్యక్తిగత నిర్ణయం కాదని, అప్పటి మంత్రివర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయంగా కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అప్పటి మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు కూడా స్పష్టంగా చెప్పారు. ‘‘ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం, దాని అమలు బాధ్యత అధికారులదే,’’ అని కేటీఆర్ తెలిపారు.

పారదర్శకంగా జరిగింది, దాచాల్సిందేమీ లేదు..

ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, దాచాల్సిందేమీ లేదని కేటీఆర్ తెలిపారు. ‘‘ఈ రోజు హరీష్ రావు చేసిన ప్రజెంటేషన్ చూస్తే, కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యత, ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అర్థమవుతాయి. హరీష్ రావు అరటిపండు వొలిచినట్టే వివరించారు,’’ అని వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం మరో దేశంలో నిర్మించి ఉంటే చరిత్రలో నిలిచిపోయేది..

45 లక్షల ఎకరాలకు నీరు అందించగలిగిన ఈ ప్రాజెక్టు మరో దేశంలో నిర్మితమై ఉంటే, ఆ నాయకుడి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేదని కేటీఆర్ అన్నారు. ‘‘భాక్రా నంగల్, నాగార్జునసాగర్, నర్మద, ఎస్‌ఆర్‌ఎస్‌పీ వంటి ప్రాజెక్టులకు దశాబ్దాల కాలం పట్టింది. కానీ, కేసీఆర్ నాలుగేళ్లలోనే కాలేశ్వరం పూర్తి చేశారు. ఇది సాధారణ విషయం కాదు,’’ అని పేర్కొన్నారు.

రాజకీయ కుట్రలు, నోటీసులతో భయపడేది లేదు

కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన నోటీసులు, కుట్రపూరిత రాజకీయాలకు భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘‘ఇప్పటికే మేము చెప్పాల్సినదంతా చెప్పేశాం. హరీష్ రావు కమిషన్ ముందు పూర్తి వివరాలు ఇచ్చారు. కేసీఆర్ ని అడిగేందుకు కొత్తగా ఏమీ లేదు,’’ అని తెలిపారు.

బీఆర్ఎస్ నేతలు తాటాకు చప్పుళ్లకు భయపడరు

ప్రస్తుతం రాష్ట్రాన్ని కాంగ్రెస్ విధ్వంసకర పాలనతో నాశనం చేస్తోందని విమర్శించిన కేటీఆర్, ‘‘420 హామీలతో ప్రజలను మోసం చేసిన పార్టీ వారికి నైతిక హక్కు లేదు. తాటాకు చప్పుళ్లకు భయపడే నాయకులు బీఆర్ఎస్‌లో లేరు’’ అని ఘాటుగా స్పందించారు.

మీడియా మేనేజ్‌మెంట్ ద్వారా ప్రధాని దృష్టి ఆకర్షించాలన్న ప్రయత్నం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా కేటీఆర్ మండిపడ్డారు. ‘‘మీడియా మేనేజ్‌మెంట్ ద్వారా ప్రధాని దృష్టిని ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ప్రజల మద్దతు లేని వారి చేతిలో నాటకాలు తప్ప మరొకటి ఉండవు’’ అని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న రాజకీయ ప్రచారానికి గట్టి ఎదురుదెబ్బగా బీఆర్ఎస్ వర్గం తరపున కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగిన ప్రయోజనాలను ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *