హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ తాజాగా కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన, తెలంగాణ భవన్లో ఈ సమావేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గత బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఆ తర్వాత మళ్లీ హాజరుకాలేదు.
హైదరాబాద్ కు కేసీఆర్..
అయితే.. ఈ బడ్జెట్ సమావేశాలకు మాత్రం ఆయన హాజరుకావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ప్రకటన రావడంతో కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఖాయమైనట్లు అర్థం అవుతోంది.
ఒక వేళ కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోనే శాసనసభా పక్ష సమావేశం జరిగేదని పార్టీ నేతలు చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకే కేసీఆర్ హైదరాబాద్ వస్తున్నారని.. అందుకే ఇక్కడే పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసినట్లు వారు వివరిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.